చంద్రబాబు గంజాయి వనంలో నుంచి బయట పడ్డా

ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

ప్రజాస్వామ్య విలువలు తెలీని చంద్రబాబు దగ్గర ఉండలేక బయటకొచ్చా

చంద్రబాబు చెప్పేది ఒక్కటి..చేసేది మరోకటి

ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తి వైయస్‌ జగన్‌

వైయస్‌ రాజశేఖరరెడ్డే నాకు స్ఫూర్తి

ఈ నెల 31న వైయస్‌ఆర్‌సీపీలో చేరుతా

 

హైదరాబాద్‌: చంద్రబాబు గంజాయి వనం నుంచి బయట పడ్డానని, వైయస్‌ జగన్‌ తులసి వనంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన మేడా ఇవాళ సాయంత్రం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు నారా చంద్రబాబు గంజాయి వనం నుంచి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ది వంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ..కాంగ్రెస్‌ను ఎదురించి సొంత పార్టీ ఏర్పాటు చేసిన వైయస్‌ జగన్‌.. తన తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రజాస్వామ్య విలువలు కలిగిన వైయస్‌ జగన్‌ లాంటి మంచి వ్యక్తి వద్దకు రావడం సొంతింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు టీడీపీలో మెలగలేక ఆ పార్టీని వీడానన్నారు.

అధికారుల సహకారంతో ఇప్పటి వరకు రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. వైయస్‌ జగన్‌ సమర్ధుడని నమ్మి వైయస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ముందుకు వచ్చానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వైయస్‌ఆర్‌ కుటుంబం చేస్తున్న పోరాటాలకు ఆకర్శితుడినై పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు..నిన్ను నమ్మం.. అందుకే వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు.  చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారిని దగా చేశారన్నారు. కాపులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు అక్రమాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

ఈ నెల 31న వైయస్‌ఆర్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్నారు. వైయస్‌ జగన్‌ సూచనల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌సీపీలో చేరుతానని ప్రకటించారు. రేపు స్పీకర్‌ ఫార్మెట్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చే విధంగా వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని పేర్కొన్నారు.

 

Back to Top