ఇంకా నీ వయస్సు, అనుభవం దేనికి బాబూ

సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల మేలోర్చి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు

మహానేత ఆశయ సాధనకు అడుగులు వేస్తున్నారు

రైతును రాజును చేసేందుకు బడ్జెట్‌లో పెద్దపీట 

చంద్రబాబు అనుభవం అంతా దోచుకోవడానికే..

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల మేలు గురించి ఆలోచన చేసి శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చాలా సందర్భాల్లో నా వయస్సు, నా అనుభవం ఎవరికీ లేదని మాట్లాడుతున్నారని, 2014 ఎన్నికల్లో అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి వాటిల్లో ఎక్కడా రాష్ట్ర ప్రజల మనోభావాలను, ఇచ్చిన హామీలను గుర్తించకుండా మోసం చేశారన్నారు. ప్రజలను వంచించిన వయస్సా.. చెప్పిన వాగ్దానాల్లో 100 శాతం నెరవేర్చాలని ఆలోచన చేస్తున్న మనసా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అసెంబ్లీలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అనుభవం రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడిందన్నారు. మంచి మనస్సున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారన్నారు. ప్రజల సమస్యలు చూసి బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. 

వైయస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణం చేసి రెండు మాసాలు కూడా పూర్తికాకుండానే పరిపాలన పరిగెడుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు చంద్రబాబు పశ్చాత్పపడుతారేమోనని భావించామని, అది ఏ మాత్రం లేకుండా ఎదురుదాడి చేసి ఏదో విధంగా తనది పైచెయ్యి అనిపించుకోవాలని చేస్తున్నాడన్నారు. లక్షల కోట్ల ప్రజల సొమ్ము చంద్రబాబు, ఆయన తాబేదారులు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజల డబ్బు ఖర్చు చేసి విదేశీ పర్యటనలు చేశారని గుర్తు చేశారు. నీరు చెట్టు, రాజధాని భూములు, పసుపు, కుంకుమ పేరుతో భారీ దోపిడీ చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్‌ తోఫా, చంద్రన్న క్రిస్మస్‌ కానుక అని కార్యక్రమాలు పెట్టారు. దాంట్లో చంద్రన్న బెల్లం, శనగపిండి బాగోలేదని బయటపడేశారన్నారు. రేషన్, పెన్షన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగడానికి చంద్రన్న కానుక సంచి ఒక్కటే ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వంలో క్యాపిటల్‌ ఇన్వ్‌స్ట్‌మెంట్‌ శ్యూనమన్నారు. 

అభివృద్ధి, సంక్షేమం అంటే గుర్తొచ్చే వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారన్నారు. వైయస్‌ఆర్‌ అంటే స్కీములు, వైయస్‌ఆర్‌ లేకపోతే స్కాములు అని ఎద్దేవా చేశారు. గతంలో వైయస్‌ఆర్, నేడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రులుగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టి తన తుదిశ్వాస విడిచే వరకు రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్‌ అందించారు. అదే రీతిలో తాను చెప్పిన మాటకు కట్టుబడి సీఎం వైయస్‌ జగన్‌ రూ. వెయ్యి నుంచి రూ.2250 పెన్షన్‌ పెంచారన్నారు. చంద్రబాబు పెట్టిన 5 సంతకాలకు దిక్కులేకుండా పోయిందన్నారు. డయాలసిస్‌ రోగులకు రూ. 10 వేలు అందిస్తున్నామన్నారు. రైతును రారాజుగా చేసిన ఘనత వైయస్‌ఆర్‌ది అయితే ఆయన విధానాలను కొనసాగించాలనే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. మహనీయుడు వైయస్‌ఆర్‌ పుట్టిన రోజును రైతు దినోత్సవంగా జరుపుకున్నామన్నారు. రైతు భరోసా పథకం కింద రూ. 12,500 పెట్టుబడి సాయం అందిస్తానని మొట్టమొదటి బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు చట్టం కూడా తీసుకువచ్చారన్నారు. వడ్డీలేని రుణాలు, వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు, ప్రకృతి విపత్తుల నిధి, ధరల స్థిరీకరణ నిధి, 9 గంటల విద్యుత్‌ పగటి పూటే రైతులకు అందించాలనే నిర్ణయం, ఆక్వా రైతాంగానికి రూ.1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్‌ ఇవ్వాలనే ఆలోచన చేశారన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి రూ. 10 వేలు చేసిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. 

Back to Top