తాడేపల్లి: రాజధానుల విషయంలో తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని, తల, తోక తీసేసి ప్రసారం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అందరం ఏకీభవిస్తున్నామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..శ్రీనివాసరెడ్డి మాటల్లోనే.. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత హైదరాబాద్ నగరాన్ని మనం కోల్పోయాం. దీనివల్ల ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా అన్ని పెట్టుబడులు అక్కడే పెట్టడం వల్ల మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగా వెనకబడ్డాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అభివృద్ధి సెంట్రలైజేషన్ జరుగుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత గుణపాఠం నేర్చుకోకుండా అదే తప్పిదం చంద్రబాబు నాయుడు చేశారు. ఆయన శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కారు. కమిటీ నిర్ణయాన్నే ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. శాసనసభలో కూడా మాట్లాడారు. వికేంద్రీకరణ జరగడం వల్ల లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, కార్యనిర్వాహక కేపిటల్ విశాఖలో, జ్యుడీషియల్ కేపిటల్ కర్నూలులో ఉండేలా ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. మేమందరం ఈ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాం. ఉత్తరాంధ్ర ఎన్నో సంవత్సరాల నుంచి వెనకబడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మహిళలు, పురుషులు అనేక రకాలుగా ఇబ్బందులు పడటం చూస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. మనందరం ఆంధ్రులం. సాటి వాళ్లను అభివృద్ధి చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రాజధాని తీసుకుంటే.. మరి ఏవిధంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో ఆయన జులైలో ప్రమాణ స్వీకారం చేస్తే అప్పటి నుంచి డిసెంబర్ వరకు కేపిటల్ ఈ ప్రాంతంలో వస్తుంది.. అని అమరావతి ప్రాంతం అనౌన్స్ చేశారో.. ఈ ఆరు నెలల కాలంలో సుమారు 4 వేల ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుగోలు చేశారు. ఈ లిస్ట్ మొత్తం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగింది వాస్తవం .. వివరాలతో సహా ఎవరెవరు ఎక్కడెక్కడ కొన్నారు అని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ విధంగా రాజధానిలో 4 వేల ఎకరాలు కొనడమే కాకుండా , లంక భూములు కూడా 4 నుంచి 5 వందల ఎకరాలు తన బినామీలకు ప్లాట్లు వాళ్ల అనుయాయులు, అనుచరులకే కేటాయించారు. ఔటర్ రింగ్రోడ్డు వాళ్ల పొలాల నుంచి వెళ్లే విధంగా డిజైన్ చేసుకున్నారు. ఈ విధంగా అమరావతిలో ఇంత అవినీతి చేసి.. భూములన్నీ సొంత వాళ్లకు కట్టబెట్టుకొని.. వాటి రేట్లు పెరిగే విధంగా అమరావతి రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో రాజధాని అక్కడ ఉంటే వాళ్ల భూముల రేట్లు పెరిగి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది కానీ.. ఒక సామాన్యుడు అక్కడికి వెళ్లి ఉండాలన్నా చాలా ఇబ్బంది. ఆ రేట్లకు సామాన్య ప్రజలు భూములు కొనే పరిస్థితి ఉండదు. ఇలాంటి నేపథ్యంలో కచ్చితంగా డీసెంట్రలై జేషన్ జరగాలి. రాష్ట్రం ఇప్పటికే రూ. 3.62 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. మళ్లీ అక్కడ ఒకే చోట రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాజధాని అభివృద్ధి చేసుకోవాలంటే.. చాలా ఇబ్బంది. రాష్ట్ర పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఒకే చోట రూ.2లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. వివిధ ప్రదేశాల్లో అంటే విశాఖ, కర్నూలు, అన్ని జిల్లాలు అభివృద్ధి చేసుకునే విధంగా వాటర్గ్రిడ్ కానీ, బొల్లాపల్లిలో రిజర్వాయర్ కానీ, వివిధ సంస్థలు తీసుకురావడం.. పెట్టుబడులు తీసుకురావడం ఇవన్నీ వికేద్రీకరణ వల్లే జరుగుతుంది. ఒకే చోట పెట్టుబడులు పెడితే మనం నష్టపోయే పరిస్థితి ఉంది. ఇది జరగకూడదంటే.. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజానికం సమర్థించాలి. సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని మేమందరం ఏకీభవిస్తున్నాం. మేం మాట్లాడివన్నీ తీసేసి.. కొన్ని పాయింట్లు పెట్టి వక్రీకరణ చేయడానికి నిన్న కొంత మంది పని చేశారు. నేను జగన్ మోహన్ రెడ్డితో పాటు రాజకీయాల్లోకి రావడం జరిగింది. పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపు 10 సంవత్సరాల పాటు వైయస్ఆర్సీపీ లోనే ఉన్నాను. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ఎక్కడ కూడా దీనిలో డీవియేషన్ లేదు. కచ్చితంగా రాజధాని అనేది మూడు ప్రాంతాలకు చెందాలి. మూడు చోట్ల రాజధానిని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.