గుంటూరు: ప్రత్యేక హోదా సాధించడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోందని, విభజన హామీలు, హోదాపై కేంద్రం తిసభ్య కమిటీ వేయడం శుభ పరిణామం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదన్నారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెప్పారని, హోదా కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. ప్రధానమంత్రిని కలిసిన ప్రతీసారి ఆంధ్రరాష్ట్రానికి స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వాలని కోరారని గుర్తుచేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషివల్లే కేంద్రం ప్రత్యేక హోదా పరిశీలిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుకు వైయస్ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్యాకేజీ తీసుకొని హోదా వద్దన్నారని గుర్తుచేశారు. వైయస్ఆర్ సీపీ పోరాట ఫలితమే హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు.