హెరిటేజ్‌ ఫ్యాక్టరీని క్లోజ్‌ చేశారా..?

పాల ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయా...? ఆ పాల ఉత్పత్తుల వల్ల ప్రమాదం లేదా?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌

గుంటూరు: చంద్రబాబు కుటుంబానికి సంబంధించి హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఉన్న హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా వ్యాధి సోకిందని ప్రచారం జరుగుతోందని, దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. టీవీ ఛానల్స్‌లో చాలా ప్రబలంగా,  విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వీడియో బైట్‌ విడుదల చేశారు.

'హెరిటేజ్‌ మిల్క్ ప్రాజెక్ట్ ద్వారా వేలు, లక్షల మందికి పాలు తీసుకువెళ్లి ఇచ్చే పరిస్దితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్‌గా ఉండే ప్రాంతాలలో వైరస్ వచ్చినప్పుడు అది ఇంకా విస్త్రతంగా వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే చంద్రబాబు బయటకు వచ్చి దీనిలో వాస్తవాలేంటి.. అవాస్తవాలేంటి.. ఏం జరిగింది.. ఎంతమందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.. ఎంతమందిని క్వారంటైన్ చేశారనే దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబుకు గుర్తుచేస్తున్నాను.

ఎందుకంటే చంద్రబాబు ఈ మధ్య కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సలహాలు ఇస్తున్నారు. రోజూ గంటల తరబడి వారు చాలా విషయాలు చెబుతున్నారు. కానీ, హెరిటేజ్‌లో సంభవించిన ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంది.

హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా...? పాల ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయా...? ఆ పాల ఉత్పత్తుల వల్ల ప్రమాదం లేదా?. వీటన్నింటికి వివరణ ఇవ్వకపోయినట్లైతే ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన ప్రజలు గానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గానీ కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై తక్షణమే చంద్రబాబు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పితీరాలని కూడా డిమాండ్ చేస్తున్నా' అని అన్నారు.

Back to Top