బాధ్య‌త‌లు స్వీక‌రించిన మంత్రులు విశ్వ‌రూప్‌, చెల్లుబోయిన‌

స‌చివాల‌యం: రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్‌, బీసీ సంక్షేమం, సినిమాటోగ్ర‌ఫీ, స‌మాచార శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీ‌నివాస వేణుగోపాలకృష్ణ‌ సచివాలయంలోని వారివారి ఛాంబ‌ర్ల‌లో మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీక‌రించారు. ప్ర‌త్యేక పూజ‌లు అనంత‌రం మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పినిపె విశ్వ‌రూప్‌కు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తదితరులు అభినంద‌న‌లు తెలిపారు. అదే విధంగా సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌కు చీఫ్‌ విప్‌ ముదనూరి ప్రసాదరాజు, ఐ అండ్‌ పీఆర్‌ శాఖాధికారులు అభినందనలు తెలిపారు.

ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: మంత్రి పినిపే విశ్వ‌రూప్‌
ర‌వాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి విశ్వ‌రూప్ మీడియాతో మాట్లాడారు. రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 998 కొత్త బస్సులను ఆర్టీసీలోకి తీసుకొచ్చామన్నారు. కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు మరింత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమలలో కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని.. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ అన్నారు.

Back to Top