గుంటూరు: ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, మరో పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేయడానికి తాపత్రయపడటం విడ్డూరం, వింతగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పేర్లు వేరు కానీ, వారిద్దరూ ఒక్కటేనని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజలంతా వైయస్ఆర్ సీపీ, సీఎం వైయస్ జగన్ వెంటే ఉంటారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ టీడీపీ, జనసేన చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, డ్రామాలను మంత్రి విడదల రజిని తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు నాయుడు వల్లే జీవో నంబర్.1 వచ్చిందన్నారు. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడేందుకే జీవో నంబర్.1 తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే.. మృతుల కుటుంబాలను పరామర్శించాల్సిన పవన్ కల్యాణ్.. ఆ మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం వింతగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రభుత్వం జీవో తీసుకువస్తే.. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ బాబు, పవన్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
విశాఖ గర్జన సమయంలో మంత్రుల మీద దాడి జరిగితే చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శించాడు. కందుకూరు 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే.. పవన్ వెళ్లి చంద్రబాబును పరామర్శించాడు.. వీరిద్దరు కలిసి చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. చంద్రబాబును పదవిలో కూర్చోబెట్టాలనే ప్రయత్నం పవన్ బలంగా చేస్తున్నాడన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా.. మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని మంత్రి విడదల రజిని ధీమా వ్యక్తం చేశారు.