తొలి విడతలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం

నాణ్యమైన మెటీరియల్‌తో ఇళ్ల నిర్మాణం చేపడుతాం

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

అమరావతి: పాదయాత్రలో పేదలకు ఇచ్చిన మ‌రో హామీని డిసెంబర్‌ 25న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చబోతున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన అనంతరం రాష్ట్రంలో తొలి విడతగా 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. రూ.26 వేల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించనున్నట్లు వివరించారు. నాణ్యమైన మెటీరియల్‌తో ఇళ్ల నిర్మాణం చేపడుతామని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించారన్నారు. ఒక్క రూపాయి కూడా పేదలపై భారం పడదని వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు రూ.1,432 కోట్ల బకాయిలు పెట్టారని, గత ప్రభుత్వ బకాయిలను కూడా విడుదల చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 

Back to Top