తిరుమల: బినామీల ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కచ్చితంగా చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తిరుమలలో మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు న్యాయ రాజధాని వస్తుంటే సీమ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా సంతోషపడాల్సిందిపోయి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి రాజధాని అంటూ కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబుకు ఏ కష్టం వచ్చినా దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ నేనున్నాను అంటూ ముందుకువచ్చి డైవర్ట్ పాలిటిక్స్కు తెరలేపుతాడని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జనకు జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. విశాఖలో గర్జన జరుగుతుందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ కావాలనే మూడు రోజులు విశాఖలో ప్రోగ్రాం పెట్టుకున్నాడని, గర్జనను డైవర్ట్ చేసి.. ఎల్లో మీడియా ద్వారా తన పిచ్చి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని మంత్రి రోజా ధ్వజమెత్తారు. మూడు రాజధానుల అంశం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు.