విజయవాడ: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి నిజమైన వారసుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. షర్మిల వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి నేను మీ బిడ్డను, ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు, ఇప్పుడు పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు. జగనన్న పైన విషం చిమ్మడం ధ్యేయంగా షర్మిల పనిచేస్తున్నారు. వైయస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ ఆశయాలు కోసం పనిచేస్తున్నది కేవలం జగనన్న మాత్రమే. ఇది ఇద్దరి మధ్య తేడా. షర్మిల.. చంద్రబాబు వదిలిన బాణం అంటూ రోజా విమర్శించారు. షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డని అన్నారు.. తెలంగాణలో పార్టీ పెట్టి గాలికొదిలేశారు. షర్మిల తెలంగాణలో ఏం చేశారు? ఇప్పుడేం చెబుతున్నారు?. వైయస్ఆర్ బిడ్డ.. వైయస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్పా, ఆయన కోసం చేసింది ఏమీ లేదని మంత్రి రోజా మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసి, ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. వైయస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. వైయస్ఆర్ చనిపోతే ఆయన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీలో షర్మిల చేరారని రోజా తప్పుపట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబుకు మేలు చేయడానికి వైయస్ పేరు షర్మిల వాడుకుంటోందని మండిపడ్డారు. వైయస్ఆర్ ఆశయాల కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వస్తే.. వైయస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని మంత్రి రోజా దుయ్యబట్టారు.