ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి

అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. నూతన ఇసుక పాలసీపై శనివారం సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  జాయింట్‌ కలెక్టర్లు, మైనింగ్‌ అధికారులతో వర్క్‌ షాప్‌ నిర్వహించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని, దీనిని లక్ష టన్నులకు పెంచాలన్నారు. ఇప్పటికే ఇసుక తవ్వకాల కోసం జిల్లాల నుంచి పట్టాదారులు దరఖాస్తులు అందజేస్తున్నారని, తక్షణం ఈ దరఖాస్తులను ఆమోదించి.. ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇసుక సరఫరాపై జాయింట్‌ కలెక్టర్‌లకు బాధ్యతలు అప్పగించామని, అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌  ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. 

రీచ్‌లకు అనుగుణంగా ఇసుక స్టాక్‌ పాయింట్‌లను గుర్తించాలని, ఓపెన్‌ రీచ్‌లో వరద పరిస్థితి కారణంగా ఇసుక తవ్వకాలు చేయలేకపోతున్నామన్నారు. గత మూడు నెలలుగా కృష్ణానదిలో వరద పరిస్థితి కొనసాగుతోందని, జలాశయాల్లో, స్థానిక జలవనరుల్లో మేటవేసిన ఇసుక నిల్వలను గుర్తించాలని, వీటిని బయటకు తీయడం వల్ల  జలాశయాల నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుండటంతోపాటు ఇసుక సరఫరా మెరుగవుతుందని మంత్రి తెలిపారు. మొదటి, రెండు, మూడు గ్రేడ్‌లలోని రీచ్‌లలో ట్రాక్టర్లకు అనుమతి ఇస్తామని, గ్రామ సచివాలయాల సిబ్బందిని రీచ్‌లవద్ద పెట్టి ఆన్‌లైన్‌ ప్రక్రియను మరింత సులభతరం మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. మైనింగ్‌ అధికారులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌లతో సమన్వయం చేసుకోవాలని, ఇసుక లభ్యత ఉన్న జిల్లాల్లో స్థానికుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇసుక అవసరాల కోసం ఆన్‌లైన్‌ లో వస్తున్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

Back to Top