ప్రభుత్వ జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు

మంత్రి పేర్ని నాని

ఆర్‌ఆర్‌ఆర్‌ టీం దరఖాస్తును కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది

అమరావతి: ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. టికెట్ల ధరలు నిర్ణయించి ఇప్పటికే జీవో ఇచ్చామన్నారు. టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నిర్మాతలు దర ఖాస్తు చేశారన్నారు. ఆ టీమ్‌ దరఖాస్తులను కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.  రూ.336 కోట్ల ఖర్చు అయినట్లు ప్రభుత్వానికి ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ దరఖాస్తు చేసుకుందన్నారు. థియేటర్లలో ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించవచ్చు అన్నారు. పెద్ద సినిమా రిలీజ్‌ డేట్ల సమయంలో చిన్న సినిమాలకు మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఒక షో కేటాయించాలన్నారు.  ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు అని చెప్పారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెమ్యూనరేషన్లు కాకుండా వంద కోట్ల బడ్జెట్‌ దాటిన సినిమాకు టికెట్‌ రేటు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కొత్తగా మొదటుపెట్టే సినిమాలన్నీ కూడా ఏపీలో 20 శాతం షూటింగ్‌  చేయాల్సి ఉంటుందన్నారు.
 

Back to Top