అజెండా నుంచి హోదాను తొలగించడం ముమ్మాటికీ కుట్రే

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేక హోదాను తొలగించడం ముమ్మాటికీ కుట్రేనని, ఆ కుట్ర వెనుక చంద్రబాబు ఉన్నారని  పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. త్రిసభ్య కమిటీ అజెండాలోని తొమ్మిది అంశాలను కేంద్రమే పెట్టి వారే తీసేశారని, చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే ఇలా చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వద్దని అమ్ముడుపోయింది టీడీపీ నేతలే.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకుంది టీడీపీనే అని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన నామమాత్రంగానే ఉన్నాయని, ఆ రెండు పార్టీలు లోపాయికారిగా చంద్రబాబుతో చేరతాయన్నారు. గడచిన మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 
 

Back to Top