అర్హులంద‌రికీ `జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన‌` సాయం

జగనన్న విదేశీ విద్యకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ‌.. సెప్టెంబర్ 30 వ‌ర‌కు గ‌డువు 

అధికారులతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ‌ నాగార్జున సమీక్ష

స‌చివాల‌యం: అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ జగనన్న విదేశీ విద్య దీవెన‌ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందిస్తుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన ప‌థకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైనట్లు ఆయ‌న వివ‌రించారు. ఈ నేపథ్యంలో మంత్రి మేరుగ నాగార్జున అధికారుల‌తో స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగనన్న విదేశీ విద్యా దీవెన‌ పథకంలో ఏడాదికి ఇంతమందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టంచేశారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీ విద్య దీవెన అందుబాటులోకి తెస్తూ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందడానికి అర్హులని స్ప‌ష్టం చేశారు. 

ఆయా కేటగిరీల దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను తమ శాఖకు ఇస్తాయని మంత్రి నాగార్జున చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో శిక్షణపొందే వారికి మెరుగైన శిక్షణ అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ, డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, డిప్యుటీ సెక్రటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. 

Back to Top