నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో సామాజిక విప్లవం కొనసాగుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అది చూసి చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. నరసరావుపేట బహిరంగ సభలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఎందరో పోరాడారని, కానీ వాస్తవ సామాజిక న్యాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పూర్తి న్యాయం చేస్తూ, వారికి అండగా ఉంటూ పాలించలేదని, అది కేవలం సీఎం వైయస్ జగన్ వల్లనే సాధ్యం అవుతోందన్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏనాడూ బడుగు, బలహీనవర్గాలకు ఎక్కడా న్యాయం జరగలేదు. దళితుల మీద యథేచ్ఛగా దాడులు జరిగాయని దుయ్యబట్టారు. బాబు రథచక్రాలు ఊడిపోయాయి.. మతి స్థిమితం కోల్పోయాడు.. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు.. అని చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. అమలాపురంలో దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు వద్దంటున్నావా? ప్రజలు నీకు తప్పక బుద్ధి చెబుతారని చంద్రబాబును హెచ్చరించారు.