విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోకి భారీ ప్రాజెక్టులను ఆకర్షించే విధంగా ఐటీ బ్రాండింగ్పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు. ఆదేశించారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ (డబ్ల్యూఎఫ్హెచ్టీ) విధానం అమలుపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార పౌరసంబంధాల శాఖ సమన్వయంతో అపీటా ప్రమోషన్పై మరింత ఫోకస్ చేయాలని సూచించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న డబ్ల్యూఎఫ్హెచ్టీ విధానం గురించి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వివరించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో పెద్దస్థాయి ఐటీ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డబ్ల్యూఎఫ్హెచ్టీ పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత 29 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని డిసెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ప్రస్తుతం విద్యుత్ కొరతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ కేంద్రాలకు కొరత లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో పవర్ బ్యాకప్ కోసం యూపీఎస్, జనరేటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలను ఆకర్షించవచ్చన్నారు. ఈ 29 కేంద్రాలకు అవసరమైన బ్యాండ్విడ్త్ సదుపాయాన్ని సత్వరమే కల్పించాలని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్రెడ్డిని ఆయన ఆదేశించారు.