పచ్చి అబద్ధాలు ప్రచురిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 
 

 విజయవాడ: ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి కొన్ని పత్రికలు వాస్తవాలు రాయకుండా వక్రీకరిస్తున్నాయని, పచ్చి అబద్ధాలు ప్రచురిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. గురువారం మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి నగరంలోని కేదారేశ్వరపేట రైతు బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..  కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని  మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే భావన కలిగించేలా అసత్యాలను ప్రచారం చేయడాన్ని మంత్రి  తప్పుపట్టారు. 

రైతుల ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా పని చేస్తున్నాం..
రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే అరటిని కొనుగోలు చేస్తుందని కన్నబాబు వివరించారు. ఇతర దేశాలకు  ఎగుమతులు లేకపోవడం వల్లనే ధర తగ్గిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో పండిన అరటిని రాష్ట్రంలో ఉన్న అని రైతు బజార్లకు తరలిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లుతూ.. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.

Back to Top