తాడేపల్లి: రాష్ట్రంలో ధర్మాన్ని పరిరక్షించడమే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం వైయస్ జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉండకూడదని, ప్రజల్లో భక్తిభావాలు పెంపొదించేందుకు ప్రతి ఊరిలో గుడి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవాళ రూ.10 లక్షలతో ప్రతి గ్రామంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికేఈ రాష్ట్రంలో 1330 దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. డిపార్టుమెంట్గా 900 దేవాలయాలు ఉన్నాయి. ఆలయం లేని ఊరు ఉండకూడదని పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నాం. అదనంగా 1465 దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నాం. వీటితో పాటు మరో 200 ఆలయాలు నిర్మించేలా ఈ రోజు సమావేశంలో కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆలయ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. దేవాదాయ శాఖ నుంచి 970 ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి 25 దేవాలయాల నిర్మాణాలకు అవుట్ సోర్సింగ్లో ఏఈ స్థాయి అధికారిని నియమించాం. ఇప్పటి వరకు రూ.230 కోట్లు సీజీఎస్కు కేటాయించాం. మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ చెల్లించి సమాచారం పంచించారు. ఇంచుమించు రూ.270 కోట్లతో సీజీఎఫ్ ద్వారా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. భగవంతుడి అనుగ్రహం పొందేలా, మంచి అలవాట్లు అలవర్చుకోవచ్చు అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.