అంత‌ గొప్ప వ్యక్తికి వెన్నుపోటు ఎందుకు పొడిచావ్‌..?

బాబు, రామోజీ, రాధాకృష్ణలు ఎన్టీఆర్‌ విగ్రహం కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలి

ఎన్టీఆర్‌ చావుకు కారణమైన దుర్మార్గులే.. ఫొటోలకు దండలేసి భజన చేస్తున్నారు

మంగళగిరిలో పప్పునాయుడు ఓటమి ఎన్టీఆర్‌ శాపమే..

ఎన్టీఆర్‌ కుటుంబం లేని పనికిమాలిన పార్టీకి ఎందుకు అధికారాన్ని అప్పగిస్తారు..?

చంద్రబాబు, లోకేష్‌ను ఎన్టీఆర్‌ అభిమానులు రాజకీయంగా సమాధి చేస్తారు

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజం

తాడేపల్లి: ఎన్టీఆర్‌ ఫొటోలకు, విగ్రహాలకు దండలు వేసి మహానుభావుడని కీర్తిస్తున్న చంద్రబాబు.. అంతటి గొప్ప వ్యక్తిని వెన్నుపోటు పొడిచి ఎందుకు పార్టీ, పదవిని లాక్కున్నాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.  ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబు, లోకేష్‌ను రాజకీయంగా సమాధి చేయడం ఖాయమన్నారు. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించి, ఆయన్ను పార్టీలోంచి సస్పెండ్‌ చేయించి, ముఖ్యమంత్రి పదవిని లాక్కొని, ఆయన చావుకు కారణమైన దుర్మార్గులు చంద్రబాబు, ఈనాడు అధినేత, ఆంధ్రజ్యోతి అధినేత.. రెండు మూడు రోజుల నుంచి ఎన్టీఆర్‌ ఫొటోలు, విగ్రహాలు, భజన కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పకుండా ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబు, లోకేష్‌ను రాజకీయంగా సమాధి చేసి.. పగా, ప్రతీకారం తీర్చుకుంటారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ మీద, ఆయన పెట్టిన పార్టీ మీద చంద్రబాబుకు ఎలాంటి ప్రేమ లేదని, ముఖ్యమంత్రి కుర్చీ, రాష్ట్రాన్ని లూటీ చేయడంపైనే చంద్రబాబుకు ప్రేమ ఉందన్నారు. చంద్రబాబు బొమ్మ, పేరు చెప్పినా ప్రజలు అసహ్యంచుకునే పరిస్థితిలో ఉందని,  బాబు, లోకేష్‌ టీడీపీకి దరిద్రంలా పట్టారు.. వీరి పేర్లు చెబితే నాలుగు ఓట్లు కూడా రాలవని తెలిసి.. ఈ దుర్మార్గులు, గుంట నక్కలంతా కలిసి ఎన్టీఆర్‌ బొమ్మలు, ఫొటోలు పెట్టుకొని భజన కార్యక్రమం మొదలుపెట్టారన్నారు.  

ఎన్టీఆర్‌ అంత గొప్ప వ్యక్తి అయితే, ఆయన మీద ప్రేమాభిమానాలు ఉంటే ఎందుకు వెన్నుపోటు పొడిచారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎందుకు సస్పెండ్‌ చేసి బయటకు పంపించారు..? ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని ఎందుకు తీసుకున్నారు..? చావుకు ఎందుకు కారణమయ్యారు..? చంద్రబాబు 420 బ్యాచ్‌ చేసింది తప్పా.. కాదా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ గొప్ప వ్యక్తి అయితే ఇవన్నీ చేసిన ఈ దుర్మార్గులను ఏమనాలి..? నీచులు, పదవికోసం ఎంగిలిమెతుకులకు ఆశపడిన కుక్కుల్లా ఎన్టీఆర్‌ పంచనచేరి మోసం చేసిన నిష్ట దరిద్రులు అని మండిపడ్డారు.  

ఎన్టీఆర్‌ మంచి వ్యక్తి, ప్రజల కోసం జీవితాన్ని ధారపోశారని భావిస్తే.. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ ఆయనకు చేసిన ద్రోహానికి చంద్రబాబు ఏరకంగా అసెంబ్లీలో వెక్కి వెక్కి ఏడ్చాడో.. ఆ రకంగా ముగ్గురు కలిసి ఎన్టీఆర్‌ విగ్రహాల దగ్గరకు వెళ్లి కాళ్లుపట్టుకొని ఏడ్చి తప్పు అయిపోయిందని క్షమించండి అని అడగాలని డిమాండ చేశారు. లేకపోతే ఎన్టీఆర్‌ పేరు చెప్పడానికి, ఆయన ఫొటో, విగ్రహం పెట్టుకోవడానికి, టీడీపీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ ముగ్గురికి లేదన్నారు.  

పదవి, పార్టీ కోసం ఎన్టీఆర్‌ను మానసికంగా చంపేసి.. ఆయన చావుకు కారణమై.. సిగ్గు, శరం లేకుండా మళ్లీ వీరే విగ్రహాలకు, ఫొటోలకు దండలేసి ఆయన గొప్పల గురించి చెబుతారంటే.. వీళ్లంత పనికిమాలిన వెధవలు రాష్ట్రంలో ఎవరూ ఉండరన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 25 సంవత్సరాలు నిండిపోయిందని గుర్తుచేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. బలమైన పార్టీని లాక్కొని తెలంగాణలో పూడ్చిపెట్టాడని, ఏపీలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం సీట్లు కూడా గెలవలేని దుస్థితికి పార్టీని చంద్రబాబు దిగజార్చాడని ధ్వజమెత్తారు. 

ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహానికి చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఆయన శాపం తగులుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆ శాపం తగిలే పప్పు నాయుడు మంగళగిరిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్‌ పేరు, బొమ్మలు వాడుకోవాలి.. అధికారంలోకి వచ్చిన తరువాత పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకుతినాలి.. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను మాత్రం అనాథలను చేయాలనే సిద్ధాంతంతోనే ఈ బ్యాచ్‌ పనిచేస్తుందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ అభిమానులు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేసి చంద్రబాబు, లోకేష్‌ కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నారన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబం లేని పనికిమాలిన పార్టీకి ప్రజలు ఎందుకు అధికారాన్ని అప్పగిస్తారు..? అని ప్రశ్నించారు. తప్పకుండా ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబు, లోకేష్‌ను రాజకీయంగా సమాధి చేస్తారు. పగా, ప్రతీకారం తీర్చుకుంటారని హెచ్చరించారు. 
 

Back to Top