బాబు వెళ్ళింది పరామర్శకా... సింపతీ కోసమా..!?

  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)

  బాబు, కొడుకులే ఊరూరా తిరిగి భువనేశ్వరి పరువు తీస్తున్నారు

  రాజకీయంగా బతకడం కోసం భార్యను బాబు రోడ్డు మీదకు తెచ్చాడు

 కుంటి సాకులతో అసెంబ్లీని వదిలేసి వరదల్లో బాబు బురద రాజకీయం

 వరద సహాయక చర్యలకు ఇబ్బంది రాకూడదనే.. కాస్త కుదుటపడ్డాక సీఎం పరామర్శ

 వరదల్లో ప్రజలు కష్టాల్లో ఉంటే... మీ సొల్లు పురాణం అవసరమా బాబూ..?

అమ‌రావ‌తి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు వెళ్లింది వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకా?  లేక ప్ర‌జ‌ల సింప‌తీ కోస‌మా అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మండిప‌డ్డారు.  రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు పలువురు దుర్మరణం చెందారు. కొన్ని గ్రామాలు నీళ్లలో మునిగిపోయి, ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, రాష్ట్ర, స్థానికంగా ఉన్న అధికారులతో వరద నష్టాలు, కష్టాలపై సమీక్షలు జరిపార‌ని తెలిపారు. వరద సహాయక చర్యలకు ఎక్కడా ఇబ్బంది రాకూడదనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే గ్రామాల వారీగా ప్రతిరోజు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా 95 వేలు, ఇల్లు మంజూరు చేయాలని (రూ.1.75వేలు) మొత్తంగా 2లక్షల 80వేలు ఇవ్వాలని, అదేవిధంగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ.5,200 అందివ్వడంతోపాటు, వారికి పూర్తిగా నిత్యవసర వస్తువులు అందచేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లలో సామాను కొట్టుకుపోయినవారికి రూ.5,500 ఇస్తున్నాం. ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నార‌ని తెలిపారు.  గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మీడియాతో మాట్లాడారు.

మంచినీటి సౌకర్యం, విద్యుత్‌ సరఫరా పునరుద్దరణ కార్యక్రమాలపై అధికారులు, స్థానిక శాసనసభ్యులతో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. అక్కడ వాతావరణం కుదుటపడి, బాధితులు తేరుకున్న తర్వాత బాధిత కుటుంబాలను, పంటనష్ట పోయిన రైతులను ముఖ్యమంత్రిగారు పరామర్శించనున్నారు. 
- అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వయసు వచ్చినా ఇంకా బుద్ధి, జ్ఞానం మాత్రం రాలేదు.  ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వైయస్సార్‌ సీపీ శాసనసభ్యులు ఏదో అన్నారంటూ కుంటి, గుడ్డి సాకులు చెప్పుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సానుభూతి రాజకీయాలు చేస్తున్నాడు. 

 ఆయన భార్యను ఏమన్నారో కూడా చెప్పడు. నా భార్యను అవమానించారని మాత్రం చంద్రబాబు చెబుతున్నాడు. ఆవిడ పేరును మేముగానీ, మరే ఇతర సభ్యులు గానీ ప్రస్తావించలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా చంద్రబాబు వినడం లేదు. రాజకీయం చేసేందుకు ఏదో కారణం కావాలి. నాడు ఎన్టీఆర్‌ను, ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు పెద్ద దుర్మార్గుడు అని ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు కూడా తెలుసు. వారు పిలిచినా పలికే స్థితిలో లేరని.. ఆ కుటుంబంలో పుట్టిన తన భార్యను రోడ్డు మీదకు తీసుకువస్తే.. వారంతా తనకు మద్దతు ఇస్తారని, ఎన్టీఆర్‌ను ఆదరించే వారు కూడా తనకు  మద్దతు ఇస్తారన్నే పన్నాగం పన్ని, రాజకీయాలు చేస్తున్నాడు.

 ఈఊరు లేదు, ఆ ఊరు లేదు.. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా కలిసి ఆవిడను అల్లరి అల్లరి చేస్తోన్న పరిస్థితిని చూస్తున్నాం. తన రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డుమీద పెట్టగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే... అది ఒక్క చంద్రబాబు నాయుడే.  ఆవు చేలో మేస్తే.. దూడ కూడా అదే పనిచేస్తుంది అన్నట్టు.. చంద్రబాబు సుపుత్రుడు కూడా తన తల్లిని అవమానించారని ఊరూరా తిరిగి చెబుతున్నాడు. ఎన్టీఆర్‌ కుమార్తె, చంద్రబాబు సతీమణి పేరును అసెంబ్లీలో కానీ, బయట కానీ ఎక్కడా చెప్పలేదు. రాజకీయంగా బతకడం కోసమే చంద్రబాబు తన భార్య పేరును తెరమీదకు తెచ్చారు. ఇది చాలా దుర్మార్గపు చర్య. ఇలాంటి భర్త, కొడుకు ఉండటం ఆమె దురదృష్టంగా చెప్పవచ్చు.

 
  కడప, చిత్తూరు జిల్లాల పర్యటన సందర్బంగా..  ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు, అక్కడ ఏమైనా  సమస్యలు ఉంటే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారించాలని డిమాండ్‌ చేయాలి, కానీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏం చూశాడో, ఏం చేశాడో తెలియదు కానీ.. అక్కడకు వెళ్లగానే ఏడుపు మొహం పెట్టుకుని నా భార్యను అవమానించారంటూ మాట్లాడుతున్నారు. వరదల్లో సర్వం కొట్టుకుపోయి వాళ్లు ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు అక్కడ కూడా ఏదోరకంగా రాజకీయ లబ్ది పొందటం కోసం తన భార్య అంశాన్ని ప్రస్తావనకు తేవడం సిగ్గుచేటు. 40మంది చనిపోయి, ఉండానికి ఇల్లులేక, తినడానికి తిండిలేక వాళ్లు ఏడుస్తుంటే... వాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఏడుపు, బాధేంటి చంద్రబాబూ...? వారు కష్టాల్లో ఉంటే, మీ పనికిమాలిన సొల్లు పురాణం అక్కడ అవసరమా? 

  రెండు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నావు కదా? అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియచేస్తే బాగుంటుంది. ప్రతిపక్ష నేతగా సమస్యలను పరిష్కరించాలని అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడితే బాగుంటుంది. అంతేకానీ "నా భార్యను అవమానించారు, అందుకే అసెంబ్లీ నుంచి వచ్చేశాను. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే రెండున్నరేళ్ల తర్వాత వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తాను" అని సొల్లు కబుర్లు అవసరమా?

 ‘గాల్లో వచ్చాడు, గాల్లో తిరిగాడు, నాతో పెట్టుకుంటే ఎవడైనా గాల్లో కలిసిపోతాడని’చంద్రబాబు మాట్లాడుతున్నాడు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని వేధించిన సోనియాగాంధీ నుంచి మీ కొడుకు పప్పు వరకూ, మధ్యలో మరెంతమందో తుప్పుగాళ్లతో సహా మొత్తం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళారో చూశారు.  చివరికి మీకు 23 సీట్లు వచ్చి, కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక బ్యార్‌మని ఏడ్చేశావంటే .. రాష్ట్ర ప్రజలు నిన్ను తీసేసిన తాహసీల్దార్‌ స్థితికి తీసుకువచ్చిన సంగతి అప్పుడే మర్చిపోయినట్లు ఉన్నావు. మీ కొడుకు మంగళగిరిలో పోటీ చేసి ఏమైపోయాడో చూశాం. ఎర్రన్నాయుడు, శంక్రరావు ఏమైపోయారో చూశాం. వైఎస్‌ జగన్‌ గారి మీద దొంగ కేసులు పెట్టి, చార్జ్‌షీట్లు వేసిన ఆ ఉద్యోగి.. జాబ్‌ మానేసి టీవీ చానల్స్‌ ఎదుట డిబేట్‌లలో కూర్చోవడం కూడా చూశాం. జగన్‌గారిని వేధించినవాళ్లు, ఆయనను దెబ్బతీయాలని చూసినవాళ్ల​కి చంద్రబాబు నాయుడులాంటి నీచాతినీచమైన గతే పడుతుంది. జగన్‌గారికి దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. 

  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు ప్రాణాలకన్నా ప్రజలే ముఖ్యమని భావించారు కాబట్టే.. రచ్చబండకు వెళుతూ మరణించారు. ఆయన మరణం గొప్పది. వైఎయస్సార్‌ గారు చనిపోయి పదేళ్లు అయినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన కొడుకును ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ప్రజలు కూర్చోబెట్టారు. అలాంటి మరణాన్ని ఎవరైనా కోరుకుంటారు.  మీదీ ఒక బతుకేనా? కొడుకును మంగళగిరిలో గెలిపించుకోలేని బతుకు మీది. భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని, ఆమెను రోడ్డుమీదకు తెచ్చిన బతుకు మీది.  వైయస్సార్‌ గారి జీవితం.. ఆయన జీవించిన జీవితం ఇవాళ్టికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అలాంటి జీవితాన్నే ప్రతివాళ్లు కోరుకుంటారు. మీ బాబుకొడుకులు బతికున్నా జీవచ్ఛవాలే. 

 వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారితో పోరాటం చేయలేక భార్యను అడ్డుపెట్టుకుని భోరున ఏడ్చి రాజకీయాలు చేస్తున్నారు. మీరు, మీ పార్టీ ఇప్పటికే రాజకీయంగా గాలిలో, మట్టిలో కలిసిపోయారు. ఇప్పటికైనా పిచ్చివాగుడు తగ్గించుకుంటే మంచిది.  ఒక్కో ముఖ్యమంత్రి పనితీరు ఒక్కో విధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు అందితే జుట్టు... అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. అలాంటిది మేము ఎందుకు చేయాలి? ఎవరి అజెండా వారికి  ఉంటుంది. మా ముఖ్యమంత్రిగారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తే అధికారులు మొత్తం ఆయన చుట్టూనే ఉంటారు. దాంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. మా శాసనసభ్యులు, అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడకు వెళతారు. 

 చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఉంది కాబట్టే టీవీ కెమెరాలు కనిపిస్తే ఏమైనా చేస్తాడు. భార్యను కూడా తీసుకువచ్చి రోడ్డు మీద నిలబెట్టాడు. అనని దానికి అన్నట్లు సృష్టించి తన భార్యను తానే అల్లరి చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు పబ్లిసిటీ కావాలి కాబట్టి. సింపతీ, ఓట్లు కావాలి. మాకు కావాల్సింది ప్రజలు మాత్రమే. వరద బాధితులకు తక్షణ సాయం అందించడమే మా కర్తవ్యం. పదికి పది సీట్లు అందించిన కడప జిల్లా ప్రజల మీద జగన్‌గారి కన్నా చంద్రబాబుకు ఎక్కువ ప్రేమ ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుంది. మానవ తప్పిదం కారణంగానే వరదలు వచ్చాయని చంద్రబాబు సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. 

  గోదావరి పుష్కరాల్లో గేట్లు మూసేసి, సినిమా దర్శకుడితో కెమెరా, యాక్షన్‌, షూటింగ్‌ అంటూ 30మందిని బలితీసుకున్న చంద్రబాబును ఏంచేయాలి, ఉరి వేయాలా? ఆయనలా గేట్లు ఎత్తుతామంటూ మేమేమీ షూటింగ్‌ పెట్టలేదు. 2,3 టీఎంసీలు కెపాసిటీ ఉండి,  అయిదు గేట్లు ఉన్న అన్నమయ్య రిజర్వాయర్ కు 32 టీఎంసీలు కేవలం 6 గంటల్లో నీళ్లు వస్తే గేట్లు కొట్టుకుపోవా? అలాంటి ప్రళయాన్ని ఆపగలిగే శక్తి ఉంటుందా? ఏది మానవ తప్పిదం? చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేస్తాడు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిద‌ని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Back to Top