కొందరి స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు

రాజ్యాంగానికి లోబడే ప్రతి వ్యవస్థ పనిచేయాలి

అమరావతి భూకుంభకోణంపై విచారణ జరిపిస్తామని ఎన్నికల్లో చెప్పాం

దళిత శంఖారావమని చంద్రబాబు పిలుపు ఇస్తే నమ్మలా..?

ఐదేళ్లలో 840 బార్లను ఓపెన్‌ చేసిన చరిత్ర చంద్రబాబుది

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజం

తాడేపల్లి: మతాల మధ్య చిచ్చుపెడుతూ చంద్రబాబు తన పబ్బం గడుపుకుంటున్నాడని, బాబు జూమ్‌ రాజకీయాలను ప్రజలు నమ్మరని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కొందరి స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని, కొన్ని వ్యవస్థల పనితీరుపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయన్నారు. రాజ్యాంగానికి లోబడే ప్రతి వ్యవస్థ పనిచేయాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడారంటే.. ‘‘అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. దోషులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందే చెప్పాం. చంద్రబాబు బినామీలు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొన్నారు. తమ ఆస్తులను కాపాడుకునేందుకే రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమరావతి భూ కుంభకోణంపై విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్రానికి లేఖ రాశారు. 

ప్రజలకు మేలు చేయాలనే నిజాయితీగా సీఎం పనిచేస్తున్నారు. ఏ రాజకీయ నేత తీసుకోలేని నిర్ణయాలను సీఎం వైయస్‌ జగన్‌ తీసుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తూ ప్రజలకు అండగా ఉన్నారు. రాజధాని పేరుతో నాడు చంద్రబాబు పెట్రో సెస్‌ విధిస్తే ఎల్లో మీడియా కళ్లు మూసుకుందా..? రహదారుల మరమ్మతుల కోసం సెస్‌ వేస్తే అదేదో మహాపాపమన్నట్లు చిత్రీకరిస్తారా..? 

ఐదేళ్లలో 840 బార్లను ఓపెన్‌ చేసిన చరిత్ర చంద్రబాబుది. తన పాలనలో దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. దళితులకు అన్యాయం చేసినందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు దళిత శంఖారావమని చంద్రబాబు పిలుపు ఇస్తే నమ్మలా..? చంద్రబాబు దళిత ద్రోహి. సీఎం హోదాలో ఉండి దళితుడిగా ఎవరైనా పుడతారా..? అన్న వ్యక్తి చంద్రబాబు. దళితుల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే వారే బాబుకు బుద్ధి చెబుతారు’’ అని మంత్రి కొడాలి నాని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top