మా కార్యకర్తలపై దాడి చేసి రంకెలేమిటీ సొల్లు ఉమా..?

దేవినేని ఉమాపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫైర్‌

ఉమా అనుచరులే వైయస్‌ఆర్‌సీపీ నేత కారు అద్దాలు పగలగొట్టారు

ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమా గ్రామస్తులను రెచ్చగొట్టారు

దళితులు, పోలీసులను ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు

వైయస్‌ఆర్‌సీపీపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది

ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌పై టీడీపీ దుష్ప్ర‌చారం

అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు చంద్రబాబే

ధాన్యం బకాయిలు రూ.3200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం

తాడేపల్లి: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు సృష్టిస్తూ రెండుమూడు ఛానళ్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలపై బురదజల్లాలనే ఉద్దేశంతో దేవినేని ఉమా అనే పనికిమాలిన వ్యక్తి పనిచేస్తున్నాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. నిన్న సాయంత్రం ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామానికి వెళ్లి.. గ్రామంలోని పెద్దలపై దుర్భాషలాడి, అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా..? అని ఆ ఊరి ప్రజలను నోటికివచ్చినట్టుగా తిట్టాడని, దేవినేని ఉమా వ్యాఖ్యలతోనే గ్రామస్తులు తిరగబడ్డారన్నారు. అక్కడున్న వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త కారును ధ్వంసం చేసి ఆ కారు దేవినేని ఉమా కారు అని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయించుకున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవినేని ఉమా చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడారంటే..

గ్రామ పెద్దలను తిట్టడం, వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త కారు అద్దాలు పగులగొట్టడంతో పాటు.. దళితులను నోటికొచ్చినట్టుగా దేవినేని ఉమా మాట్లాడాడు. పోలీసులను దుర్భాషలాడాడు. అంబేడ్కర్‌ రాజ్యాంగం నడవడం లేదు.. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రేపు టీడీపీ అధికారంలోకి వస్తుంది. మీ బడ్డలు ఊడదీస్తాం.. టోపీలు ఊడబీకుతాం అని పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బెదిరించాడు.  కేసులు పెడితే చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కరూ దేవినేని ఉమా దేశ్‌కీ నేతలా అన్యాయం జరుగుతుందని ఎల్లో మీడియాలో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 

మైలవరంలో కంకర క్వారీలు 1978 నుంచి ఉన్నాయి. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, దొనబండలో దాదాపు 40 సంవత్సరాలకు పైగా అక్కడ మైనింగ్‌ జరుగుతుంది. దేవినేని ఉమా మంత్రిగా, మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత మైనింగ్‌ జరిగిందో అధికారులు మార్కు చేసిన మ్యాప్‌లు ఇస్తారు. 2014–19 వరకు అత్యధిక మైనింగ్‌ జరిగిన ప్రాంతం మైలవరం. సొల్లు ఉమా శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువ మైనింగ్‌ జరిగింది. 40 సంవత్సరాల కంటే ఐదేళ్లలో 70 శాతం మైనింగ్‌ జరిగింది. 

1978 నుంచి మైనింగ్‌ జరుగుతుంటే అక్కడున్న కాంట్రాక్టర్లు, క్రషర్స్‌ ఓనర్స్‌ను బెదిరించి 2016లో దేవినేని ఉమా కొత్త మైన్‌లను ఓపెన్‌ చేశాడు. డబ్బులు ఇవ్వమని బ్లాక్‌మెయిల్‌ చేసి వాళ్లు డబ్బులు ఇవ్వకపోతే అది అటవీ ప్రాంతమని దొంగ రిపోర్టు కూడా రాయించాడు. ఆ క్వారీలను 2018లో నిలిపివేశాడు. తరువాత మళ్లీ వాళ్లను పిలుచుకొని మాట్లాడి చిల్లర వసూలు చేసుకొని కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ మినిస్టర్‌గా ఉండగా ఇది ఫారెస్ట్‌ ల్యాండ్‌ కాదు.. రెవెన్యూ ల్యాండ్‌ మైనింగ్‌కు అభ్యంతరం లేదని, ఫారెస్ట్‌ అధికారుల రిపోర్టుపై స్టే ఇప్పించింది కూడా దేవినేని ఉమానే. 

ఫారెస్టు ల్యాండ్‌ అని రాయించి.. తరువాత కేఈ కృష్ణమూర్తితో రెవెన్యూ ల్యాండ్‌ అని స్టే ఇప్పించాడు. అధికారం పోయాక 2020లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ దోపిడీ చేస్తున్నాడు.. ఇవన్నీ మైనింగ్‌ భూములు.. వీటిల్లో మైనింగ్‌ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. మళ్లీ డబ్బులు కావాల్సి వస్తే అక్కడున్న క్రషర్స్‌ మిల్‌ ఓనర్లను బెదిరించి.. నాకు నెలనెలా మామూళ్లు, లేకపోతే సంవత్సరానికి ఇంత ఇవ్వాలని వారితో డబ్బుల బేరాలు ఆడుకొని.. ఏదోరకంగా గొడవలు సృష్టించి మైనింగ్‌ ఆపించాలని సొల్లు ఉమా డ్రామాలు.

సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద ఎత్తున మొదలుపెట్టిన ఇళ్ల కార్యక్రమానికి కంకర కావాలి. ఆ కంకర దొరకకూడదు.. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోవాలనే కుట్రతో సొల్లు ఉమా పనికిమాలిన డ్రామాలు ఆడుతున్నాడు. ఏదోరకంగా అక్కడున్న మైనింగ్‌ ఆపించాలి. డబ్బులు వసూలు చేసుకోవాలనే కార్యక్రమాలను మొదలుపెట్టి నిన్న అక్కడకు వెళ్లి అభూత కల్పన సృష్టించి మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి కార్లు పగలగొట్టి.. ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నాడు.  

చంద్రబాబు అధికారంలో ఉండగా ఖర్జూరనాయుడు రాజ్యాంగం, కిస్‌మిస్‌ నాయుడు రాజ్యాంగం, లవంగం నాయుడు రాజ్యాంగం నడిచింది. పప్పు రాజ్యాంగం నడిచింది. సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం నడుస్తోంది. అంబేడ్కర్‌ చూపించిన దారిలో రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల సంక్షేమం కొనసాగుతోంది.

వసంత కృష్ణప్రసాద్‌ 50 ఏళ్లు నిండిన తరువాత కూతురు పెళ్లి చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చాడు. గుంటూరు – చిలకలూరుపేట మధ్యలో వంద ఎకరాల భూమిలో రూ.450 కోట్లతో స్పిన్నింగ్‌ మిల్లును 2005లోనే స్థాపించుకున్నాడు. హైదరాబాద్‌లో పదిచోట్ల ఇండిపెండెంట్‌ హౌస్‌లు, అపార్టుమెంట్లు నిర్మించాడు. డబ్బులు సంపాదించి, పిల్లల పెళ్లీళ్లు చేసి.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చి దేవినేని ఉమా మీద పోటీ చేసి ఓడించాడు. నీతిగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని పనిచేస్తుంటే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే.  అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని స్వర్గీయ ఎన్టీఆర్‌ చెప్పారు. అలాంటి లుచ్చాగాడి నాయకత్వంలో పనిచేస్తున్న దేవినేని ఉమా లాంటి వెధవలు మాపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరినీ వదిలే పరిస్థితి లేదు. పోలీసులు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఎవరైతే రెచ్చగొట్టారో.. గొడవ పెట్టుకోవడానికి ప్రజలను తిట్టారో వారిపై పూర్తి ఎంక్వైరీ చేసి కేసులు పెట్టమని చెప్పాం. 

పనికిమాలిన ఉమా, రైతు రాబంధు చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. సివిల్‌ సప్లయ్‌ డిపార్టుమెంట్‌ రూ.3300 కోట్లు రైతులకు బాకీలు అని చంద్రబాబు సీఎంకు లెటర్‌ రాశారు. పది రోజుల ముందు ప్రెస్‌మీట్‌లో చెప్పాం.. 15వ తేదీన రూ.1600 కోట్లు రిలీజ్‌ చేస్తున్నాం.. 25వ తేదీన కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు వస్తుందని ప్రామిస్‌ చేశారు. ఈనెలాఖరులోగా పూర్తిగా చెల్లిస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే 17వ తేదీన రూ.1600 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. కేంద్రం నుంచి రావాల్సిన రూ.5056 కోట్లకు గానూ రూ.2800 కోట్లు విడుదల చేశారు. రైతులకు రూ.3200 కోట్లు జమ చేశాం. ఈవారం, పది రోజుల్లో సేకరించిన ధాన్యం ఆన్‌లైన్‌ అవ్వాల్సిన కార్యక్రమం వల్ల డిలే అయ్యింది.. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తాం. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే.. ఇచ్చిన మాట కచ్చితంగా అమలవుతుంది’’ అని కొడాలి నాని అన్నారు.
 

Back to Top