ఇవేవీ చంద్రబాబుకు, డబ్బాకొట్టే ఛానళ్లకు కనబడవు

ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ 

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

కృష్ణా: ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని, ఆర్థిక కష్టాలున్నా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా పుట్టగుంట గ్రామంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, మన బడి నాడు – నేడు, జగనన్న గోరుముద్ద, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చదువుల విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రజల మనసులు గెలిచిన వారే నాయకులవుతారని, సీఎం వైయస్‌ జగన్‌ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.  

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు రూ.10 వేల కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ కేటాయించారని చెప్పారు. రూ.120 కోట్లుతో గుడివాడలో జిల్లాస్థాయి ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ పునర్జీవం పోశారన్నారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారన్నారు. దీని ద్వారా 2,434 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందనుందన్నారు. కానీ, ఇవేవీ చంద్రబాబుకు, బాబు డబ్బా కొట్టే ఛానళ్లకు కనబడవన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని చంద్రబాబు జూముల్లో వాగుతున్నాడని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
 

Back to Top