బాబుకు వయస్సు పెరిగినా.. బుద్ధి మారలేదు

చంద్రబాబు కాపలా కాసినా డాక్టర్‌ రమేష్‌ను అరెస్టు చేస్తాం

పరిహారం విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే ఆదర్శం

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పెద్ద మనసున్న నాయకుడని, పరిహారం విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో రూ.50 లక్షలు, ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారన్నారు. స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ‘అల్జీమర్‌’ వ్యాధితో బాధపడుతున్నారని, కమ్మ సంఘానికి అధ్యక్షుడిలా బాబు ప్రవర్తన ఉందన్నారు. విరాళాలు ఇచ్చే వారికి చంద్రబాబు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. రమేష్‌ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించిందని, డాక్టర్‌ రమేష్‌ను రక్షించేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

చంద్రబాబు తన ఇంట్లోనే డాక్టర్‌ రమేష్‌ను పెట్టుకుని కాపలా కాస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు కాపలా కాసినా రమేష్‌ను అరెస్ట్‌ చేస్తామన్నారు. బాధితుల పరామర్శకు వస్తే కరోనా వస్తుందని చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నాడని, తనకు కూడా ఎక్స్‌గ్రేషియా వస్తుందని బాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు లేదన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు అని, రానున్న రోజుల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు వయస్సు పెరిగిన బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. 
 

Back to Top