త‌క్కువ ధ‌ర‌కు వినోదం అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది

ద‌మ్ముంటే సినిమా తీసిన వాళ్లే టికెట్లు అమ్ముకోమ‌ని చెప్పండి

మంత్రి కొడాలి నాని

విజ‌య‌వాడ‌:  పేద ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కే వినోదం అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌శ్నిస్తున్న వారికి మంత్రి కొడాలి నాని కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్రంలో టాక్స్ పే చేసేవారికి, ఇక్కడ జీవించే వాళ్ళకి మాత్రమే గవర్నమెంటును అడగడానికి నైతిక విలువ కలిగి ఉంటారు.ఎవరైనా సరే పక్క రాష్ట్రాల్లో బతుకుతూన్నోల్లు ఎటువంటి ప్రశ్నలు వేయడానికి అర్హతలేదు. మాకు ఓటు వేసిన వారికి, రాష్ట్రంలో జీవిస్తున్న
 వారికి జ‌మాబుదారిగా ఉంటాం. మాపై అవాకులు చ‌వాకులు పేల్చేవారికి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సినిమా టికెట్ల విష‌యంలో ప్ర‌భుత్వానికి ఏమీ సంబంధం లేదంటున్నారు. ప్ర‌భుత్వానికి సంబంధం లేక‌పోతే వారే అమ్ముకోమ‌ని చెప్పండి.
ఇందులో చ‌ర్చ ఎందుకు? మ‌మ్మ‌ల్ని ఎందుకు అడ‌గ‌డం?.  సినిమాలు తీసిన వాళ్లే అమ్ముకోమ‌ని చెప్పండి. మాట్లాడే వాళ్లంతా కూడా ఆర్చే వాళ్లు కాదు. తీర్చేవాళ్లు కాదు. పేద ప్ర‌జ‌ల‌కు త‌క్కువ రేట్ల‌కు వినోదం అందించాల్సిన బాధ్య‌త ఈ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంది. సినిమా టికెట్ల ధ‌ర‌లు నియంత్రించే హ‌క్కు ఈ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉంది. ఇక్క‌డున్న ఆర్థిక ప‌రిస్థితులను బ‌ట్టి మేం నిర్ణ‌యం తీసుకుంటాం. కోర్టు ఆదేశాల మేర‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ 13 మందితో ఒక క‌మిటీ కూడా ఏర్పాటు చేయించారు. ఆ క‌మిటీ ఏం చేయాలో నిర్ణ‌యం తీసుకుంటుంది. క‌మిటీ నిర్ణ‌యం రాక‌ముందే వీళ్లంతా మాట్లాడుతున్నారు. అంత సీన్ ఉంటే వాళ్లే అమ్ముకోమ‌ని చెప్పాల‌ని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. 

Back to Top