తాడేపల్లి: టీడీపీ జెండా రాష్ట్రం నుంచి పీకేయడం ఖాయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 45 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు కానీ, ఏ వర్గానికి, ఏ కులానికి అయినా మేలు చేసిన దాఖలాలు లేవు. 33ఏళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా పనిచేసి, 45ఏళ్లపాటు కేబినెట్ ర్యాంకులో వివిధ పదవులు నిర్వహించిన బాబు... మా కుప్పానికి ఏం చేశాడు?, మాకు ఏం చేయగలిగాడు అని అక్కడ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు వల్లే చంద్రబాబు నాయుడును నిలదీస్తున్నారు. చంద్రబాబుపై తిరుగుబాటు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే మొదలైంది. మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్న బీసీల నుంచే తిరుగుబాటు ప్రారంభమైంది. రాజకీయంగా తమను వాడుకోవడమే కాకుండా, అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు చెంచాల్లా చూశాడు, బీసీలను బానిసలను చేశాడనే అభిప్రాయంతో బీసీ వర్గాల ప్రజలు చంద్రబాబును తరిమి,తరిమి కొట్టడానికి కుప్పం నుంచే నాంది పలికారని మంత్రి అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. - ఒకవైపు బీసీలు, మరోవైపు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రైతన్నలు, మహిళలు కూడా చంద్రబాబు మాకు వద్దని చెబుతున్నారు. అసలు చంద్రబాబుకు కుప్పం వచ్చే అర్హత ఉందా అని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. *మరోవైపు అర్హత ఉన్న ప్రతి గడపకూ సంక్షేమం* అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే జగన్ మోహన్ రెడ్డిగారు అర్హత ఉన్న ప్రతి గడపకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసాతో పాటు ప్రతి నెల ఠంఛన్గా పెన్షన్ పంపిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అని అని రాష్ట్ర ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. ప్రతి గడపకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్ గారు అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి, ప్రతి గడపకు వచ్చి తాను ఫలానా పథకం అమలు చేశానని చెప్పుకునేందుకు ఏదీ లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచిపని కూడా చేయలేని చంద్రబాబు మా ప్రభుత్వంపై విమర్శలా?. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడుసార్లు కూడా కుప్పం రాని చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం సిగ్గు, శరం లేకుండా ఇప్పుడు మూడురోజులు పర్యటన అంటూ హడావుడి చేస్తున్నాడని అక్కడ ప్రజలు తరిమి కొడుతున్నారు. - అన్న క్యాంటీన్ అంటు హంగామా చేస్తున్న చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నిచోట్ల అన్న క్యాంటిన్లు పెట్టారు?. ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్న క్యాంటిన్లలో భోజనాలు చేశారు అని అడుగుతున్నాం. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసి అడ్డుకోవాలని చూసినా మేం ప్రతి గడపకు, కోట్ల మందికి సంక్షేమాన్ని అందిస్తున్నాం. *175 నియోజకవర్గాల్లోనూ తిరుగుబాటు తప్పదు* చంద్రబాబుపై ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు ఒక్క కుప్పంతో ఆగదు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కానీ ఇప్పుడు మొదలైన తిరుగుబాటుతో.. చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లినట్టే. టీడీపీ మాకొద్దు, నారా చంద్రబాబు నాయుడు పనికిరాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తిరగడానికి వీల్లేదని.. బీసీలందరూ కంకణం కట్టుకున్నారు. టీడీపీ హయాంలో బీసీలను వాడుకుని... అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వారిని అణచివేసి, తొక్కి నార తీశాడు. మా ఓట్లను దండుకుని మాకు సున్నం పెట్టాడని ప్రతి వర్గం చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తున్నారు. - 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఏ గడపకు వెళ్లలేదు. ఎవరినీ ఓటు అడగే పరిస్థితిలేదు. చంద్రబాబు నాయుడుకు, టీడీపీ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు. మూడేళ్ల వైయస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హతే ప్రామణికంగా ప్రతి గడప గడపకు సంక్షేమం, అభివృద్ధి అందించింది. *ముఖ్యమంత్రి జగన్ గారి జేజేలు* భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నమనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు. ఆయన నేతృత్వంలో అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందుకుంటున్న అన్నివర్గాల ప్రజలు శభాష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ.. జేజేలు పలుకుతున్నారు. ముఖ్యమంత్రిగారు బటన్ నొక్కగానే తమ ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది కాబట్టే తాము కూడా పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడం, కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారిని మాత్రమే చూస్తామని ప్రజలంతా ఏకమై ముక్తకంఠంతో చెబుతున్నారు. *బాబును నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే..* చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఆయన తోక పట్టుకుని ఈదాలనుకుంటే.. కృష్ణానో గోదావరిలోనో మునిగిపోయినట్లే. టీడీపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు నాయకులకు చెప్పేది ఒక్కటే.. బాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు, అప్రమత్తంగా ఉండండి అని చెబుతున్నాం. - సాక్షాత్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్కా లేదన్నాడు. చంద్రబాబు నాయుడు లేదు.. చెత్తాలేదు. మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్ ఇంకా మనల్ని ఏమీ గెలిపిస్తాడని అచ్చెన్నాయుడు అన్నాడు. దీన్ని ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. అచ్చి, బుచ్చి, ధూళి అందరికీ చెబుతున్నా... చంద్రబాబును నమ్ముకుంటే ఏమీ ఒరగదు సరికదా.. నిండా మునిగిపోవడమే. ప్రజల మనస్సుల్లో బాబుకు దుర్గార్ముడు అనే ముద్ర పడిపోయింది. ప్రజలు ఏవిధంగా కుప్పంలో చెత్త చెత్తగా ఓడించి, తిరుగుబాటు చేశారో... మీ పార్టీలో కూడా వేరే నాయకత్వం కావాలంటూ తిరుగుబాటు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కుప్పంలోనే తిరగలేకపోతున్నాడు చంద్రబాబు. మరోవైపు ఆయన కొడుకు మంగళగిరిలో తిరగలేకపోతున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్ముకుంటే నిలువునా నట్టేట మునిగినట్లే. *బాబుకు ఇక ఆ నలుగురే దిక్కు* చంద్రబాబు నాయుడు ఆధారపడిందల్లా ఆ నలుగురి మీదే. ఆ నాలుగు గడపల మీదే. ఈనాడు రామోజీరావు గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 నాయుడు గడప, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ గడప. ఈ నలుగురి గడపల్నే చంద్రబాబు నమ్ముకున్నాడు. ఈ నాలుగు కొంపలకు వెళ్ళి బేరసారాలు నడుపుతున్నాడు. - దీనికి కథా, స్క్రీన్ ప్లే, నారా చంద్రబాబు నాయుడు అయితే.. డైరెక్టర్గా నాదెండ్లను పెట్టారు. నారా- నాదెండ్ల సేన ఆధ్వరంలో ఈ నాలుగు కొంపలను నమ్ముకున్నాడు. *కేఏ పాల్ కు- పవన్ కల్యాణ్ పాల్ కు తేడా లేదు* జనసేనను తన పార్టీలో విలీనం చేసుకోవాలని పవన్కల్యాణ్కు, కేఏపాల్ ఉచిత సలహా ఇచ్చాడు. కేఏపాల్కు పవన్ కల్యాణ్ పాల్కు వ్యత్యాసం లేదు. కేఏపాల్కు ఏపీలో సీట్లు లేవు. పవన్ కల్యాణ్కు కూడా అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటును అంతా కలిపిస్తానంటూ పవన్ కబుర్లు చెబుతున్నాడు. ఏం కలిపేస్తాడు...? మా పార్టీకి ఎవరు వ్యతిరేకం అని అడుగుతున్నాం. ఓవైపు చంద్రబాబును బీసీలు మొదలు అన్ని వర్గాల ప్రజలు తరిమి కొడుతున్నారు. అలాంటి బాబుకు పవన్ మద్దతా?. సిగ్గులేకుండా చంద్రబాబును మోయమని కాపులను పవన్ అడుగుతున్నాడు. 175స్థానాల్లో పోటీ చేస్తావా లేదా అని అడిగితే దానికి సమాధానం ఉండదు. చంద్రబాబును మాత్రం మోస్తానని చెబుతాడు. - చంద్రబాబు నాయుడును జాకీలు, మోకులు, జేసీబీలను పెట్టి లేపుదామన్నా కుప్పకూలిపోయాడు. అలాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ ఏం మోస్తాడని అడుగుతున్నాం. ఒకడేమో లెగవలేడు... మరొకడు లేపలేడు. చంద్రబాబు, పవన్ లు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఉన్న ఎల్లో మీడియా, సోషల్ మీడియా వారిని పైకి లేపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు ఎక్కడ లెగుస్తారు? 73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తాము అధికారంలో ఉండగా ఈ పథకం అమలు చేశామని చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు, ఆయన పార్టీ ఉంది. ఇలాంటి నమ్మకద్రోహులు మా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు. - ఒకవేళ మాకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టైతే, 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు. లేవలేని ప్రతి ఒక్కడూ వైఎస్ జగన్ గారిని, వైయస్సార్ సీపీని విమర్శించడమే ఫ్యాషన్ అయిపోయింది. 2014లో ముచ్చటగా మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఆ తర్వాత విడిపోయాయి. మళ్లీ పొత్తులు అంటూ లేని బలాన్ని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు, పవన్ తోక పట్టుకుని ఈదాలనుకుంటే.. దెబ్బకు మునిగిపోవడం ఖాయం. అయ్యాకొడుకులు జెండా పీక్కోని పారిపోతే... మీరెక్కడ ఉంటారు..? మీ నాయకత్వాన్ని మార్చుకోండి. *కుప్పంతో సహా 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయ దుందుభి* రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతృప్తిగా, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస జగన్ మోహన్ రెడ్డిగారు పాలన చేస్తున్నారు. నిన్న అక్కడకు వెళ్ళి.. కుప్పం నాది, నా గడ్డ అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కుప్పంలో అన్ని స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు వైయస్సార్ సీపీకి పట్టం కట్టారు, రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీదే కుప్పం. ఎవ్వరూ ఏం చేయలేరు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కుప్పం నుంచే వైఎస్ఆర్సీపీ విజయాన్ని మొదలుపెట్టి 175 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తుంది. కుప్పం నుంచి పారిపోయి చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా వచ్చినా... ఎక్కడకు వెళ్లినా... ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఓడిపోవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రం నుంచి పీకేయడం ఖాయం. చంద్రబాబు దుకాణం సర్దుకోవాల్సిందే. ఖేల్ ఖతం చంద్రబాబు దుకాణం బంద్. ఆ పార్టీ నాయకులంతా వేరే దారి చూసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం.