దేశమంతా రాష్ట్రంవైపు చూసేలా సభను నడిపించండి

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

 

వెలగపూడి: దేశమంతా ఆంధ్రరాష్ట్రం వైపు, చట్టసభవైపు చూసేలా సభాపతిగా శాసనసభను నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నానని నూతనంగా ఎన్నికైన స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆంధ్రరాష్ట్ర శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి బుగ్గన శాసనసభలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో క్రమక్రమంగా విలువలు తగ్గుతున్నాయి. ఎన్నో చోట్ల చట్టం, రూల్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని అధికార పార్టీలోకి తీసుకోవడం, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం, అదే సభలో గెలిచిన పార్టీ గురించి మాట్లాడడం చూశాం. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైపు, చట్టసభలవైపు చూసి అభినందించి గొప్ప పేరు సంపాదించేలా సభాపతిగా సభను నడపాలని ఆకాంక్షిస్తున్నా..

1983–99 వరకు అమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. 1983లో చట్టసభలోకి అడుగుపెట్టారు. 1985లో మరోసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టి విప్‌గా పనిచేశారు. 1994 నుంచి మంత్రివర్యులుగా పనిచేశారు. ఆ తరువాత రెండు దఫాలుగా మున్సిపల్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా, టూరిజం మంత్రిగా, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గంలో కూడా ప్రత్యేకమైన స్థానం కల్పించుకున్నారు. స్పోర్ట్స్‌ మంత్రిగా ఉన్నప్పుడు సిడ్నీలో జరిగిన ఒలంపిక్స్‌ గేమ్స్‌ ప్రతినిధిగా హాజరయ్యారు. ప్రస్తుతం స్పీకర్‌గా గొప్ప స్థానాన్ని అధిరోహించారు.

Back to Top