మరో వందేళ్ల‌ వరకూ ఇబ్బందుల్లేకుండా `భూ హక్కు-భూ రక్ష`

ప్రభుత్వం ముందుకు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం

చంద్రబాబు ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు..?

విద్యుత్ ఛార్జీలు పెంపు- బషీర్‌బాగ్ కాల్పులకు చంద్రబాబే పేటెంట్

గ్రామగ్రామానికి బాబు అవినీతిని విస్తరిస్తే.. సీఎం వైయ‌స్ జగన్ సంక్షేమం, అభివృద్ధిని తీసుకెళ్తున్నారు 

మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

తాడేప‌ల్లి: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి, భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ `వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష` ప‌థ‌కం తీసుకొచ్చారని మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. గ్రామ కంఠాలను కూడా పక్కాగా సర్వే చేస్తున్నామ‌ని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం చాలా వేగంగా ముందుకు వెళుతోంద‌న్నారు. భూహ‌క్కు-భూర‌క్ష ప‌థ‌కంపై స‌మీక్ష అనంత‌రం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..
ఈ పథకం అమలు వల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు చాలా బాగా ఉన్నాయి, దీనిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తాం. పట్టా భూములు, డీఫామ్‌ భూములు, గ్రామ కంఠాలు, చెరువులు అన్నీ సర్వే చేస్తున్నాం. ఈనాం, దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయి?. భవిష్యత్తులో కూడా భూముల విషయంలో ఎలాంటి సమస్యలు, తగాదాలు రాకుండా ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, మరో వందేళ్ల వరకూ భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ విధానం. 

విద్యుత్ ఛార్జీల పెంపు సిఫార్సులపై..
విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. వాటిని పరిశీలించి, తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు నాయుడికి అసలు మాట్లాడే అర్హతే లేదు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచాడు? టీడీపీ హయాంలో ఎన్నిసార్లు పెరిగాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు, బషీర్‌బాగ్‌లో కాల్పులకు చంద్రబాబు పేటెంట్‌ కదా? ఎవరి హయాంలో రైతులపై కాల్పులు జరిగాయి?. 

అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెరిగితేనో, పెంచితేనే మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. టీడీపీ హయాంలో టారిఫ్ ఎంత ఉంది? డిస్కమ్‌లకు ఆదాయం ఎంత, అప్పులు ఎంత? వాటి నిర్వహణ వ్యయం ఎంత?..  ఇలాంటి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రతిపక్షాలు ప్రాక్టికల్‌గా మాట్లాడితే బాగుంటుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు పెంచలేదు అని అంటున్నాడే? గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ళు చంద్రబాబు అధికారంలో లేడా? ఆయన విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదా? వాటి పర్యావసానంగానే,  బషీర్‌బాగ్ కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోలేదా? 

అప్పులు చేస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి.  చంద్రబాబులా స్నోలు, పౌడర్లకు అప్పులు తెచ్చి దుర్వినియోగం చేస్తున్నామా? ప్రభుత్వం చేసే ప్రతి అప్పుకు లెక్క ఉంది. రూ. 50వేల కోట్లకు లెక్కలు లేవంటూ చిన్నపిల్లలు మాట్లాడినట్లు మాట్లాడమా? పరిజ్ఞానం, పరిపక్వత ఉన్న మాటలేనా అవి? మూడేళ్లలో లక్షా 32వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాల ద్వారా, డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి  డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేసింది వాస్తవం కాదా? నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదా? రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టడం లేదా? వీటన్నింటికి లెక్కలు ఉన్నాయి కదా? ఈ లెక్కలన్నీ ఆర్థిక మంత్రిగారు, ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే  లెక్కలు చెప్పారు. ప్రజల కోసం పారదర్శకంగా చేస్తున్న ఖర్చుపై సీబీఐ విచారణ చేయించాలని అడగటం విడ్డూరంగా ఉంది. మరి కాగ్‌ ఎందుకు ఉంది? ఏజెన్సీలు ఎందుకు ఉన్నాయి? 

చంద్రబాబు కంటే దుర్మార్గులు ఎవరుంటారు..?. టీడీపీ ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఏముంది..?. టీడీపీ ప్రజల్లోకి వెళితే, పల్లెలకు వెళితే.. ముందు మీ హయాంలో ఏం చేశారంటూ టీడీపీ నాయకుల చొక్కాలు పట్టుకుని ప్రజలు కొడతారు. టీడీపీ వాళ్లు గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలతో అవినీతి చేసి బొక్కేస్తే.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వచ్చాక గ్రామగ్రామానికి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి ఆసరా, రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాం, పింఛన్ డబ్బులను వాలంటీర్లే నేరుగా ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నారు. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళితే ఏం జరుగుతుందనేది తెలుస్తుంది.

Back to Top