అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తాం

ప్రతిపక్షం, ఎల్లోమీడియా దుష్ప్రచారానికి దీటుగా మా కార్యాచరణ

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: మూడేళ్లలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామగ్రామాన, వాడవాడలా ప్రజలకు వివరించాలని పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ క్యాడర్‌ ప్రజలందరితో మమేకం కావాలని సీఎం సూచించారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌ నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించారని, ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నూటికి 99 శాతం నెరవేర్చి,  రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న కార్యక్రమాలపై కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు, చంద్రబాబు లాంటి వ్యక్తులు లేనిపోని అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తామని సీఎం చెప్పారన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలి
పవన్‌ కల్యాణ్‌ ఎవరిపైనేనా విమర్శ చేసేముందు తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు. రాజకీయ వ్యవస్థలో ఉన్నానా..? ఉంటే ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల పట్ల నా పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందా..? ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నానా..? అనేది పవన్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఎక్కడా అలాంటి మాటలు, అంశాలు పత్రికల్లో ఎక్కడా కనిపించలేదని, ఎంతసేపూ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు కనిపించాయన్నారు. రాజకీయంగా విధానపరమైన నిర్ణయాలు ప్రకటించలేని వ్యక్తి మాటలకు S సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 
 

Back to Top