మామపై రాళ్లు వెయ్యించి అల్లర్లు సృష్టించిన చరిత్ర మాది కాదు 

మంత్రి బొత్స సత్యనారాయణ

శ్రీకాకుళం: పిల్లనిచ్చిన మామపై రాళ్లు వెయ్యించి అల్లర్లు సృష్టించిన చరిత్ర మాది కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా మంత్రి, ఎమ్మెల్యేపై మేమే దాడి చేయిస్తామా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరలేదా అని నిలదీశారు. ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తామని చెప్పారు.

కాల్పులు, లాఠీ చార్జ్‌ జరగాలని కోరుకున్నారని తెలిపారు. చంద్రబాబు దివాళకోరు రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకోవాలన్నారు. జిల్లాల పునర్వీభజన సమయంలో అభ్యంతరాలు ఉంటే 30 రోజుల గడువు ఇస్తారన్నది ఓ నిబంధన అన్నారు. తుని ఘటనపై పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించారు. 
 

Back to Top