అమరావతి: స్థానిక సంస్థల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల రెండో రోజు పన్నుల చట్టంలో చేసిన సవరణలను మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ఆయన మాట్లాడుతూ..పాత చట్టంలో మార్పులు చేయడానికి ముఖ్య ఉద్దేశం..రాష్ట్రంలోని స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే. ఇందులో కేంద్రం సూచనలను పరిగణలోకి తీసుకొని బిల్లులో మార్పులు తెస్తున్నాం. కేంద్రం కొన్ని నామ్స్ను సూచించింది. సీఎం వైయస్ జగన్ కూడా పేదలకు ఇబ్బంది కలుగకూడదని కొన్ని సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా బిల్లు రూపొందించాం. ఏడాది ఇంటి అద్దెలపై వచ్చే ఆదాయంతో ఇంటి పన్ను వేయాలని..ఇందుకోసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశాం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమల్లో ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో క్యాపిటల్ వ్యాల్యూ వివరాలను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్తే..ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి విలువైన సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టాం. నివాస స్థలాన్ని బట్టి శ్లాబ్గా 375 ఎస్ఎఫ్టీ ఉన్న వారికి నామమాత్రంగా పన్ను విధించాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. 375 ఎస్ఎఫ్టీ ఉన్న ఇంటికి కేవలం రేఊ.50 మాత్రమే పన్ను ఉంటుంది.ఇదంతా కూడా నెలకు కాదు..ఏడాదికి ఒకసారి పన్ను విధిస్తారు. ఖాళీ స్థలాలకు గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నాం. మాజీ సైనిక ఉద్యోగులు, ప్రార్థనల స్థలాలు, క్రీడా మైదానాలు, స్వచ్చందంగా నిర్వహించే ఆసుపత్రులకు కూడా మినహాయింపులు ఇచ్చాం. ఎవరికి ఏ ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో 10 శాతానికి మించకుండా పన్నులు రూపొందించామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.