పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తాం

పర్యాటకరంగం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చూస్తాం
 
స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని పర్యాటక, యువజన, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు టూరిజాన్ని  కాలయాపన చేసిందని, బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించి కేవలం 230 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ సహకారంతో రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అతిపెద్ద తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ అభివృద్ధి చేసి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. అతిథి దేవోభవ అన్నట్లుగా పర్యాటకులకు అతిథ్యం ఇచ్చి టూరిజమ్‌ పరంగా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం ఉంది. కాబట్టి టూరిస్టులను ఆకర్శించవచ్చు. ఆదాయంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నాం. 13 జిల్లాల్లో టూరిస్టు స్పాట్లు ఎక్కడున్నాయో గుర్తిస్తాం. 2018–2019 బడ్జెట్‌లో అరకొరగా టూరిజానికి కేటాయించారు. ఇందులో కూడా వెయ్యి కోట్లు యువనేస్తం పథకానికి మళ్లించారు. చంద్రబాబు చేతలకు మాటలకు చాలా తేడా ఉంది. టురిజానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచుతాం. ఏపీలో 8 శిల్పారామాలను ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉంది. హైదరాబాద్‌ మాదిరిగా అమరావతిలో ఒక శిల్పారామం కట్టించాల్సిన అవసరం ఉంది. గుజరాత్‌ రాష్ట్రంలో టూరిజమ్‌ను అభివృద్ధి చేసేందుకు అమితాబ్‌బచ్చన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఏర్పాటు చేశారు. మనం కూడా అలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. విదేశీ పర్యాటకుల కోసం అన్ని భాషలు తెలిసిన వారిని నియమించాల్సి ఉంది. కొండపల్లి పోర్ట్‌పై మీడియా పబ్లిసిటీ ఇవ్వాలి. టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌కు మీడియా సహకారం అవసరం. ఇందుకోసం ఒక పీఆర్‌వోను కూడా నియమిస్తాం. ఏలూరులో ఒక మ్యూజియం ఏర్పాటు చేశాం. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా మ్యూజియాలను ప్రారంభిస్తాం. 
 

Back to Top