చిప్పకూడు కోసం తాపత్రయపడకు లోకేష్‌..

అవినీతి బయటపడితే శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లాల్సిందే..

గత ప్రభుత్వంలో ప్రతీ స్కీమును స్కాములుగా మార్చారు

కామన్‌సెన్స్‌ లేకపోతే స్టాన్‌ఫర్డ్‌ అయినా వీధిబడి అయినా ఒక్కటే

అచ్చెన్నాయుడు సమరయోధుడా..? జ్యోతిరావుపూలేనా..?

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్‌రెడ్డి మహానుభావుడా..?

బీసీలకు, అగ్రవర్ణాలకు సపరేట్‌ చట్టాలు ఉన్నాయా..?

లోకేష్‌.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హెచ్చరిక

తాడేపల్లి: గత ప్రభుత్వం ప్రతీ స్కీమును.. స్కాములుగా మార్చేసిందని, చేసిన అవినీతి అంతా ఇప్పుడు బయటపెడుతుంటే చంద్రబాబు, లోకేష్‌ వెన్నులో వణుకుపుడుతోందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. కార్మికుల సొమ్మును పందికొక్కులా తిన్న అచ్చెన్నాయుడిని సాక్షాధారాలతో సహా అరెస్టు చేశామన్నారు. చట్టాలు అందరికీ సమానమేనని, బీసీలకు, అగ్రవర్ణాలకు సపరేట్‌ చట్టాలు ఉన్నాయా..? అని చంద్రబాబు, లోకేష్‌లను ప్రశ్నించారు. రూ.150 కోట్ల స్కామ్‌ చేసిన వ్యక్తికి మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. అచ్చెన్నాయుడు స్వాతంత్య్ర సమరయోధుడా..? లేక జ్యోతిరావు పూలేనా..? ప్రజల ప్రాణాలను బలిగొన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి మహానుభావుడా..? సత్యహరిశ్చంద్రుడా..? అని ధ్వజమెత్తారు. బీసీలందరికీ సిగ్గుండాలని లోకేష్‌ మాట్లాడుతున్నాడని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఫైరయ్యారు. లోకేష్‌ నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అచ్చెన్నాయుడికి సంబంధం లేదు.. ముఖ్యమంత్రిగా నేను చెబితేనే చేశాడని చంద్రబాబును ఒప్పుకోగలడా..? అని ప్రశ్నించారు.  

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షంలో ఉండగానే.. ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరెప్షన్‌’ పుస్తకం ద్వారా బయటపెట్టామన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన సెక్రటేరియట్‌లో లీకులు, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ, ఇసుక, సదావర్తి భూములు, చంద్రన్న కానుక, ఫైబర్‌ గ్రిడ్‌లలో దోపిడీ, విశాఖలో ల్యాండ్‌ స్కామ్, రాజధాని పేరుతో భూ దోపిడీ, అనేక స్కీమ్‌లను స్కామ్‌లుగా మర్చిన నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఏ దోపిడీ చేయకపోయి ఉంటే ఆనాడే విచారణకు వెళ్లి చిత్తశుద్ధి నిరూపించుకునేవాడన్నారు. 

గత ఐదేళ్లలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పామని, చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామన్నారు. అవినీతి బాగోతం బయటకు వస్తుంటే తప్పించుకోవడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తీసుకువస్తున్నాడని మంత్రి అనిల్‌ ధ్వజమెత్తారు. అపార అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి అవినీతిపరులకు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. బీసీలకు, అగ్రవర్ణాలకు సపరేట్‌ చట్టాలు ఉన్నాయా..? బీసీలు తప్పుచేస్తే అరెస్టు చేయకూడదని చట్టాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తాతని, తండ్రులను చూశానని లోకేష్‌ మాట్లాడుతున్నాడని, వైయస్‌ రాజారెడ్డి కాలంలో లోకేష్‌.. ముక్కులోంచి చీముడు కార్చుకుంటూ చడ్డీలు వేసుకొని తిరుగుతుంటాడని ఎద్దేవా చేశారు. లోకేష్‌ నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలన్నారు. ఇక అధికారం చేజిక్కడం కలేనని చంద్రబాబుకు అర్థమైపోయిందన్నారు. అవినీతి స్కాములలో ఎంతమంది అరెస్టు అవుతారో తెలియని పరిస్థితి.. కొంతమంది వైయస్‌ఆర్‌ సీపీ, బీజేపీకి వలసలు కడుతున్నారు.. మరికొంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి సర్దుకుంటున్నారు.. దీంతో ప్రెస్టేషన్‌ ఎక్కువై చంద్రబాబు కాగడాలు పట్టుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. 

లోకేష్‌నాయుడు చిప్పకూడు.. చిప్పకూడు అని కలవరిస్తున్నాడని, పైన తధాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని చురకంటించారు. కామన్‌సెన్స్‌ లేకపోతే స్టాంఫర్డ్‌లో చదివావు.. వీధి బడిలో చదివినా ఒక్కటేనన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం స్పష్టంగా అమలు చేస్తున్నాం కాబట్టే చంద్రబాబు, లోకేష్, మిగతా అవినీతిపరుల అందరి వెన్నులో వణుకుపుడుతోందన్నారు. ఫైబర్‌గ్రిడ్‌లో లోకేష్‌ను అరెస్టు చేస్తారని ఎవరూ చెప్పకుండానే.. తన నెంబర్‌ నెక్ట్‌ అని అతనే అనుకుంటున్నాడన్నారు. చేసిన అక్రమాలు కూడా బయటకు వస్తాయని, ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదని హెచ్చరించారు. 

 

Back to Top