గుంటూరు: వర్షం పడుతున్నా, మబ్బులు పట్టినా, పిడుగులు పడుతున్నా, మెరుపులు మెరుస్తున్నా.. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జవసత్వాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి అంబటి రాంబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్ల పరిపాలన పూర్తిచేసుకొని నాల్గవ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఇంకా రెండేళ్లు పూర్తిచేసుకొని ప్రజల చెంతకు వెళ్లి.. మళ్లీ వారి ఆశీస్సులు పొంది.. వన్స్మోర్ అనిపించుకొని సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకూ వెళ్లండని, మూడేళ్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించండి.. వారి ఆశీస్సులు పొందండి అని నాయకులు, కార్యకర్తలకు సీఎం వైయస్ జగన్ చెప్పారని గుర్తుచేశారు. ప్రతి ఇంటికీ వెళ్తున్నాం.. ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్ నినాదమే మార్మోగుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘రెండు సంవత్సరాల తరువాత తిరిగి ఎన్నికలు జరిగినప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం వైయస్ జగన్ను ఎన్నుకునే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దశలో అధికారం లాక్కోవాలని, తనది కాని అధికారాన్ని అనుభవించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు. చంద్రబాబుతో యుద్ధం అయితే ఐదు నిమిషాల్లో పూర్తిచేస్తాం. చంద్రబాబుతో కాదు యుద్ధం.. ఆయన వెనుక ఉన్న దుష్టచతుష్టయంతో యుద్ధం. ఒకరు చెరుకూరి రామోజీరావు.. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి పచ్చమీడియా స్థాయికెళ్లి.. లక్షలాది కోట్లు దొంగ మార్గంలో అన్వేషించిన ప్రబుద్ధుడు.
రెండెకరాలతో ప్రారంభించి.. పార్టీలు మారి మామనే వెన్నుపోటు పొడిచి అక్రమంగా అధికారంలోకి వచ్చి లక్షలాది కోట్లు సంపాదించిన ధనవంతుడు. వీరికి తోడు ఏబీఎన్ రాధాకృష్ణ.. సైకిల్, స్ట్రింగర్, తరువాత అన్యాయంగా, అక్రమంగా సంపాదించి ఆ పేపర్కే అధిపతి అయిన పెద్ద మోసగాడు. ఈ ముగ్గురు కాకుండా.. టీవీ5 నాయుడు ఈ నలుగురు దుష్టచతుష్టయం.. తమది కాని అధికారాన్ని అనుభవించాలని, సీఎం వైయస్ జగన్ నుంచి అధికారాన్ని లాక్కోవాలని అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న దుష్టచతుష్టయం.
మహాభారతంలో దుష్టచతుష్టయాన్ని చూశాం. పాండవుల దగ్గర నుంచి అధికారాన్ని లాక్కోవాలని దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు.. ఆరోజున ఎలా పతనం అయ్యారో.. ఈరోజున ఆంధ్రరాష్ట్రంలో అలా ఈ దుష్టచతుష్టయం పతనం కాబోతున్నారు.
పేదవాడు చదువుకునే బడి, పేదవాడు వైద్యం చేసుకునే వైద్యశాలలు బాగుచేసిన మహానుభావుడు సీఎం వైయస్ జగన్. ఇది ఆ దుష్టచతుష్టయానికి కనిపించదు. కుళ్లు, కుతంత్రాలతో ఏదేదో రాసి.. బురదజల్లాలని ప్రయత్నం చేసే ఆ దుష్టశక్తులను ఎదుర్కోవడానికి సిద్ధంకండి.
ఈ దుష్టచతుష్టయానికి తోడు మరొకరు ఉన్నారు. ఎవరైనా పార్టీపెడితే వాళ్లు అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ, ఒకాయన పార్టీ పెట్టాడు.. ఆయన అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు.. చంద్రబాబు అధికారంలోకి రావాలి. ఆయనకు కావాల్సింది ప్యాకేజీ మాత్రమే. ఆయనే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్. దత్తపుత్రుడి అభిమానులు సీఎం.. సీఎం అంటున్నారు.. కానీ, దత్తపుత్రుడు ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు సీఎం అంటున్నాడు. అలా అనేందుకు సిగ్గుండాలి.
అనేక కుట్రలు చేశారు. కుతంత్రాలు చేశారు. 16 నెలలు జైల్లో నిర్బంధించారు. ఆస్తులు సీజ్ చేశారు. ఆస్తులు పోయినా.. ప్రజలే నా ఆస్తి అని చిరునవ్వుతో బాధలను ఎదుర్కున్న వ్యక్తి సీఎం వైయస్ జగన్. ఎవరూ ఏమీ అనకపోయినా.. మైకులను పిలిచి బావురుమని ఏడ్చినవాడు ఈ రాష్ట్రానికి నాయకుడిగా పనికివస్తాడా అనేది ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. కష్టపడి అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. ప్లీనరీ, ప్లీనరీకి అడుగులు ముందుకేస్తూ.. సీఎం వైయస్ జగన్ కష్టార్జీతంతో ఎదిగిన పార్టీ, వైయస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఏర్పడిన రాజకీయపక్షం ఇది. ఈ రాజకీయ పక్షాన్ని ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. ఎవరూ ఏమీ చేయలేరు’.