పాఠ‌శాల విద్య బ‌లోపేత‌మే  `సాల్ట్‌` ల‌క్ష్యం 

మంత్రి ఆదిమూలపు సురేష్

రాబోయే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు

విద్యాశాఖ అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో “ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయక పథకం” (SALT) అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు (ఇన్ఫ్రా)  ఎ.మురళి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య  పాల్గొన్నారు.

ఐదేళ్లు (2021-22 సంవత్సరం నుండి 2026-27 వరకు) కాల పరిమితి కలిగిన ఈ పథకానికి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు (IBRD) 250 మిలియన్ అమెరికన్ డాలర్ల (1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి అన్నారు. దీంతో రాబోయే ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయన్నారు.

ఈ పథకం ద్వారా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ-విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరచడం, సంస్థాగత సామర్థ్యాలను, సామాజిక సంస్థల ప్రమేయాన్ని బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన సేవలను అందించడం వంటి ముఖ్యమైన మూడు కీలక అంశాలపై దృష్టి సారించి, రాష్ట్రంలో అభ్యసనాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.  ఇది ప్రపంచ బ్యాంకు ప్రత్యేక ప్రాజెక్టు అని, మన రాష్ట్రంలో గత పదేళ్లలో ఇలాంటి ప్రాజెక్టు అమలు జరగలేదని పేర్కొన్నారు.  ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని మంత్రి చెప్పారు. 

ఇలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రానికి రావడం గర్వకారణం అని కొనియాడారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సలహా సంస్థల నుంచి కన్సల్టెంట్లను ఎంపిక చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐఏఎస్ అధికారి, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామని మంత్రి తెలిపారు. కడప జిల్లాలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఏర్పాటయిన వైఎస్సార్‌ విజేత స్కూల్ తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పథకానికి చెందిన ప్రధాన అభివృద్ధి లక్ష్యాలు, ఫలిత రంగాల కార్యాచరణ ప్రణాళికను మంత్రి వివరించారు.

Back to Top