తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారంతా అమ్మ ఒడికి అర్హులు

ఇంటర్మీడియట్‌ వరకు పథకం పొడిగిస్తూ సీఎం నిర్ణయం

త్వరలోనే విద్యాశాఖలోని ఖాళీల భర్తీ

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి: పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన విద్యా శాఖ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలను బడిలో చేర్చిన తరువాత ఆ విద్యార్థికి ఉద్యోగం కల్పించే వరకు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి. ఉద్యోగ భద్రత వరకు ఏ విధంగా తీసుకెళ్లాలని చర్చించడం జరిగిందన్నారు. స్కూల్‌ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అమ్మ ఒడి పథకం వర్తించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ముఖచిత్రాలను మార్చేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. వైస్‌ చాన్స్‌లర్, అధ్యాపకులు, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం చెప్పారన్నారు. దీనిపై త్వరలోనే సర్చ్‌ కమిటీని వేయడం జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారు మాత్రమే అమ్మ ఒడి పథకానికి అర్హులని, ప్రతి తల్లికి రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతందని చెప్పారు.

 

తాజా వీడియోలు

Back to Top