ఐదు రకాల పండ్లు @ రూ.100

పండ్ల డోర్‌ డెలీవరీ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి కన్నబాబు 
 

 తూర్పుగోదావరి : ఐదు రకాల పండ్లను రూ.100లకే ఉద్యానవన శాఖ, మెప్మా ద్వారా  ప్రజలకు చౌకగా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో మంగళవారం రూ. 100లకే ఐదు రకాల పండ్లను డోర్‌ డెలీవరి సదుపాయాన్ని మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యానవన రైతులకు మేలు జరిగేలా.. వినియోగదారులకు చౌకగా పండ్లు అందించేలా కిట్ల రూపంలో డోర్‌ డెలీవరీ చేస్తున్నామని తెలిపారు.  

త్వరలోనే అన్నిప్రాంతాలకు..
ముందుగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో వీటిని ప్రారంభించి త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. మామిడి పండ్ల సీజన్‌ మొదలైన నేపథ్యంలో మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు140 టన్నులు, తిరుపతి నుంచి 1.2 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేశామని తెలిపారు. కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ వంగా గీత అన్నారు. ధరలు పెరగకుండా వినియోగదారులను ఆదుకుంటున్నారని తెలిపారు. రూ. 100లకే ఐదు రకాల పండ్లు సదుపాయాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు

Back to Top