వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణను సిద్ధం చేయండి

 అధికారులకు సీఎం వైయ‌స్ జగన్ ఆదేశం 
 

తాడేప‌ల్లి: క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన  కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ పై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ తయారీ, వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇవ్వాలి, పంపిణీ సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతులపై వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు. అనంతరం రాష్ట్ర అధికారులతో సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వహించారు.

వ్యాక్సిన్ పంపిణీలో పాటించాల్సిన శీతలీకరణ పద్ధతులు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే విషయాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులను వైయ‌స్ జగన్ ఆదేశించారు. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్ ను నిల్వ చేయడం, అదే ఉష్ణోగ్రతలో వాటిని మారుమూల ప్రాంతాలకు తరలించడం అనేవి చాలా కీలకమైన విషయాలని... దీనికి సమగ్రమైన ప్రణాళిక రచించాలని చెప్పారు. వివిధ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేయాలని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పారు.

Back to Top