శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

కాకినాడ: పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉన్నా.. అక్కడ ఏదో జరుగుతుందని చంద్రబాబు క్రియేట్‌ చేస్తున్నారని, శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. రాజకీయ లబ్ధికోసమే టీడీపీ చలో ఆత్మకూరు కార్యక్రమం చేపడుతుందన్నారు. కాకినాడలో హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు పల్నాడు ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏడు రాజకీయ హత్యలు జరిగితే అందులో ఆరు పల్నాడులోనే జరిగాయని, అక్రమ మైనింగ్‌ జరిందని ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదుదారులపైనే కేసులు పెట్టి హింసించారన్నారు. కే టాక్స్‌ పేరుతో కోడెల శివప్రసాద్‌ కుటుంబం ప్రజలను దోచుకుతిన్నారన్నారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టి బెదిరించారని, గ్రామాల్లో తిరగనివ్వకుండా చేశారన్నారు. అవన్నీ మరుగున పడవేయడానికే చంద్రబాబు చలో ఆత్మకూరు పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

Back to Top