బాబుపై కోపంతో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యకాండ

టీడీపీ పూర్తిగా నాశనమైపోయిందన్న బాధతోనే దాడులు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించాడన్న  కోపంతో గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యకాండకు దిగుతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఓటు హక్కును వినియోగించుకున్న హోంమంత్రి సుచరిత.. మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు బహిష్కరించామని చంద్రబాబు చెప్పినప్పటికీ కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

టీడీపీ అధినాయకత్వం ఎన్నికలను వదిలేసిందన్న కోపంతో చంద్రబాబు నిర్ణయాన్ని ప్రశ్నించలేక.. ఘర్షణలకు దిగుతున్నారన్నారు. పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుందనే బాధ వ్యక్తం చేస్తూ దాడులు తెగబడుతున్నారని మండిపడ్డారు. ‘నామినేషన్స్‌ వేశారు.. బ్యాలెట్‌ పేపర్‌లో పార్టీ సింబల్‌ కూడా వచ్చిన తరువాత బహిష్కరణ చేయడం ఏంటీ..? పార్టీ శ్రేణులు ఎవరూ బయటకు రావొద్దు. ఓటింగ్‌లో పాల్గొనొద్దు అంటే అది బహిష్కరణ అవుతుంది’, పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ అని బహిరంగంగా చెబుతూ.. లోపాయకారిగా పోటీ చేయండి అని వారి పార్టీ కార్యకర్తలకు చెప్పడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శణమన్నారు. 
 

Back to Top