కుటుంబ విలువలు గురించి మాట్లాడేది వెన్నుపోటుదారులా..?

రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత

 మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్ గారు

 రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న మేలును పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ రాజకీయాలు

తాడేప‌ల్లి:  కుటుంబ విలువ‌ల గురించి మాట్లాడేది వెన్నుపోటుదారులా అని రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత మండిపడ్డారు. వెన్నుపోటు నాయకత్వంలో పనిచేసేవారు, కుటుంబ విలువలే లేని వ్యక్తులు, సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి  కుటుంబం గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే, ఆ మాటలను చూసి  మిమ్మల్ని ప్రజలు మరింతగా అసహ్యించుకుంటున్నార‌ని తెలిపారు.  చంద్రబాబుకు కుటుంబ అనుబంధాలు లేవు కాబట్టి, ఎవరికీ కుటుంబ అనుబంధాలు ఉండకూడదు అనుకుంటాడ‌ని విమ‌ర్శించారు.  చంద్రబాబుకు చెల్లెళ్ళ మీద, తోబుట్టువుల మీద ప్రేమ లేదు కాబట్టి, ఎవరికీ చెల్లెళ్ళ మీద ఎలాంటి ప్రేమ లేదు అని ప్రచారం చేయిస్తాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారతారో.. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, వంద ఉదాహరణలు దొరుకుతాయి. అందుకే, తన మాదిరిగానే అందరూ ప్రవర్తిస్తారని పదే పదే ఆరోపణలు చేయిస్తుంటాడు. 

మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం
రాష్ట్రంలో మహిళా సాధికారిత ఏంటనేది చేసి చూపించింది ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారే. అక్కచెల్లెమ్మల పేరు మీద దాదాపు 31లక్షలమందికి ఇళ్ల స్థలాల కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ గారికే దక్కుతుంది. తమ బిడ్డలను చదవించుకోవడానికి వీలుగా, అమ్మ ఒడి ద్వారా ఏటా రూ. 15 వేలు చొప్పున 43 లక్షల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం, అలాగే 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థికంగా చేయూత అందించి వారిని చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నారు.  జగనన్న విద్యా దీవెన, గోరుముద్ద కార్యక్రమాలు అమలు చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పాటుపడుతున్నారు. అలానే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతల్లో రూ. 27 వేల కోట్లకు పైగా రుణాలు రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మహిళల అభ్యున్నతి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని పథకాలను అమలు చేస్తూ, మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలు ఇటువంటి చెత్త రాజకీయాలను తెరపైకి తెస్తున్నాయి. 

  అలాంటి ముఖ్యమంత్రిగారి మీద ఆరోపణలు, అసత్యాలు మాట్లాడినంత మాత్రాన  రాష్ట్ర ప్రజలు వాటిని గుడ్డిగా నమ్మేందుకు సిద్ధంగా లేరు. వైయ‌స్ జగన్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారా, లేదా? ఆర్థికంగా తాము ఏవిధంగా బలోపేతం అవుతున్నామనేది రాష్ట్రంలోని మహిళలందరికీ తెలుసు.

  ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా ముఖ్యమంత్రిగారు నెరవేర్చుతున్నారు. 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇవాళ 31 లక్షలమందికి ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌గారికి దక్కుతుంది.  మా ప్రభుత్వం చెప్పినదానికంటే మించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం, తొలివిడతలో సుమారు 15 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే. గజం స్థలం కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేదవాళ్లు ఇవాళ సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు. 

మహిళలకు జరుగుతున్న మేలును పక్కదారి పట్టించేందుకే..
 రాష్ట్రంలో మహిళలకు ఇంతపెద్దఎత్తున జరుగుతున్న మేలును పక్కదారి పట్టించేందుకు... ఈరోజు  ముఖ్యమంత్రిగారి సతీమణి మీద కూడా ప్రతిపక్షం అవాకులు చెవాకులు పేలుతోంది. సీఎంగారి సోదరి షర్మిల గారు పక్క రాష్ట్రంలో పార్టీ పెడితే రాష్ట్రానికి రాకుండా తరిమేశారని నోటికొచ్చినట్లు, అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఒక మహిళగా షర్మిల గారు, సొంతగా పార్టీ పెట్టుకుంటే అది తప్పుగా ఎలా అనిపిస్తుంది. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. 

 కరోనా నేపథ్యంలోనూ, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ,  లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఇచ్చిన హామీలకు కట్టుబడి,  ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా, ముఖ్యమంత్రిగారు నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ చేశారు. 

కోటి పది లక్షలమంది దిశ యాప్ డౌన్ లౌడ్ చేసుకున్నారు
 మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా దిశ యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దాదాపు కోటి పది లక్షల మందికి పైగా మహిళలు ఈ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వాళ్లు ఎక్కడ నుంచి అయినా, ఏ ఆపదలో ఉన్నా, సాయం కోరితే తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ పక్కనపెట్టేసి, జగన్ మోహన్ రెడ్డిగారి గురించి నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు ఏం చేశారో చెబితే మంచిది. డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఎందుకు ఎగ్గొట్టారని ఆ పార్టీ నేతలు చంద్రబాబును నిలదీయాలి. అలానే, బ్యాంకుల్లో కుదవ పెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికే తెచ్చిస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశాడని ఆ పార్టీ నాయకులు చెబితే బాగుంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా, మహిళల జీవితాలతో చెలగాటమాడినందుకే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు, మహిళలు టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశారు అన్న విషయం గుర్తుంచుకుంటే మంచిద‌ని మంత్రి సుచ‌రిత వ్యాఖ్యానించారు.

Back to Top