మానవత్వమే సీఎం వైయ‌స్ జగన్ మతం

హోం మంత్రి  మేకతోటి సుచరిత 

 సాయం చేయడాన్ని చేతులుదులుపుకోవడం అనరు.. మానవత్వం అంటారు 

 ఏనాడూ పైసా సాయం చేయని చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు 

 దిశ చట్టం ఇంకా అమలులోకి రాకపోయినా.. రోజుల్లోనే విచారణ పూర్తి చేసి, శిక్షలు పడేలా చేస్తున్నాం 

 మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం 

 పక్కరాష్ట్రంలో జరిగిన ఘటనతో మహిళల భద్రత కోసం "దిశ" తెచ్చాం 

 ఏపీ దిశ చట్టం దేశంలోని పలు రాష్ట్రాలకు మార్గదర్శకమైంది 

 దిశ యాప్‌ జాతీయ స్థాయిలో 5 అవార్డులు గెలుచుకుంది 

 బాబు హయాంలో వనజాక్షి నుంచి కాల్ మనీ నేరాల వరకు ఏరకంగా భద్రత కల్పించారో చూశాం 

సీఎం వైయ‌స్ జగన్‌ గారి పాలనలో ఎస్సీ, ఎస్టీలు ఎంతగానో గౌరవాన్ని పొందుతున్నారు 

  తాడేప‌ల్లి: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి ప్రభుత్వం సాయం చేస్తే.. దాన్ని చేతులు దులుపుకోవడం అని మాట్లాడుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలకు హోం మంత్రి సుచరిత చురకలు అంటించారు. బాధిత కుటుంబానికి సాయం చేయడాన్ని చేతులు దులుపుకోవడం, నేరం  అని  ఎవరూ అనరని, దానిని మానవత్వం అంటారని సుచరిత హితవు పలికారు. మానవత్వమే ముఖ్యమంత్రి జగన్ గారి మతం అని పునరుద్ఘాటించారు. దిశ చట్టం ఎక్కడ ఉందని ప్రతిపక్షాలు మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. దిశ చట్టం ఇంకా అమలులోకి రానప్పటికీ, ఆ చట్టాన్ని అనుసరించే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులపై రోజుల్లోనే విచారణ పూర్తి చేసి,  త్వరితగతిన శిక్షలు పడే విధంగా చేస్తున్నామని తెలిపారు. మహిళల రక్షణే మా ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని చెబుతూ..  మహిళా భద్రత విషయంలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ గారిదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం దేశంలోని పలు రాష్ట్రాలకు మార్గదర్శకమైందని తెలిపారు. మహిళల భద్రత కోసం ఉపయోగిస్తున్న దిశ యాప్‌ జాతీయ స్థాయిలో 5 అవార్డులను గెలుచుకుంది అని హోం మంత్రి వివరించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో  
మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రిగారు దిశ చట్టాన్ని తీసుకు వచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ.. దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని అమలు కోసం 18 దిశా పోలీస్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేసి, మూడు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేలా ముందుకు వెళుతున్నాం. 
 దిశ చట్టం ఎక్కడ ఉందని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.  దిశ చట్టం ఇంకా అమలులోకి రాకపోయినా.. ఆ బిల్లు చేశాకే మహిళ భద్రతతో పాటు, శిక్షలు అమలు చేయడంలోనూ రాష్ట్ర పోలీస్‌ శాఖ ఎంతో వేగంగా పని చేస్తున్నారు. మహిళా భద్రత విషయంలో పెనుమార్పులు వచ్చిన విషయాన్ని అందరూ గమనించాలి.
 గతంలో ఏవైనా నేరాలు జరిగేతే దాని విచారణకు మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టేది. అదే  2019కి వచ్చేసరికి వంద రోజుల సమయం తీసుకుంటే, 2020కు వచ్చేసరికి 86 రోజులు, 2021లో 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయి.
 దిశ చట్టంలో చెప్పిన విధంగా ఏడు రోజుల్లోనే  చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని చట్టంలో పొందుపరచడం జరిగింది. దిశ వచ్చాక 1645 కేసులకు సంబంధించి ఏడు రోజుల్లోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేశాం. అలాగే 1531 సైబర్‌ బెదిరింపులు, 2017 లైగింక వేధింపుల కేసుల్లో చార్జ్‌షీట్‌ లు దాఖలు చేశాం.  
 చట్టం ఇంకా అమల్లోకి రానప్పటికీ దాని ప్రకారం.. దాదాపు 60 అత్యాచార కేసులు, 92 అత్యాచార, పోస్కో కేసులు, 130 పోస్కో యాక్ట్‌ కేసులు, 718 వేధింపులు కేసులు.. ఇవన్నీ ఏడు రోజుల్లోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం జరిగింది. దాదాపు 2114 కేసులలో 15 రోజుల్లో  చార్జ్‌షీట్‌ దాఖలు చేశాం. ఇవన్నీ దిశ చట్టం ద్వారానే జరిగాయి.
  2లక్షల 11వేలమంది లైంగిక నేరస్తుల వివరాలు సేకరించి, వాటిని జియో ట్యాగింగ్‌ చేయడం జరిగింది. అలాగే మహిళలపై దాడి చేసిన వారిని 148 మందిని దిశ చట్టం ప్రకారం శిక్షించడం, వారిలో ముగ్గురికి ఉరిశిక్ష, 17మందికి జీవిత ఖైదు, ముగ్గురికి 20ఏళ్ల జైలు శిక్ష, 10మందికి పదేళ్లు జైలుశిక్షలు పడటం జరిగింది. 

 భారతదేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల ప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నఈ దిశ చట్టం యొక్క తీరుతెన్నులను పరిశీలించిన ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ ద్వారా దాదాపు 39 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మూడు లక్షల పదివేల మంది దిశ యాప్‌ను ఉపయోగించుకోవడం, దాని ద్వారా వచ్చిన ఫిర్యాదులల్లో 2988 కాల్స్‌ పై చర్యలు తీసుకుని, 436 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఆంధ్రప్రదేశ్ లో అమలలో ఉన్న దిశ యాప్‌ జాతీయ స్థాయిలో అయిదు అవార్డులు గెలుచుకోవడం జరిగింది.

 చంద్రబాబు హయాంలో మహిళా ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చేయి చేసుకుంటే ఏవిధంగా భద్రత కల్పించారో మనం అందరం చూశాం. అదేవిధంగా ర్యాగింగ్‌ భూతానికి రిషితేశ్వరి ఏవిధంగా బలైపోయిందో చూశాం. అలాగే కాల్‌మనీకి సంబంధించి మహిళలపై అత్యాచారాలు ఎవరి హయాంలో జరిగాయో చూశాం.  
 గత రెండేళ్లలో చూస్తే మహిళలకు సంబంధించి ఏదైనా సంఘటన జరిగితే..  పోలీసులు నేరస్తులను వేగంగా పట్టుకోవడం జరిగింది. 
 పదేపదే తాడేపల్లి ఘటన గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఎక్కడా ఒక క్లూ కూడా లేకపోయినా, ఆ నేరస్తులను కూడా పట్టుకోవడం జరిగింది.  అలాగే రమ్య హత్య కేసులో 24 గంటల్లోనే నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు. 

 నారా లోకేష్‌ పరామర్శల పేరుతో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. బాధితురాలి కుటుంబీకులను ఇంటికి వెళ్లి పరామర్శించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వాసుపత్రి వద్ద మృతదేహాన్ని కదలనివ్వకుండా తన  పార్టీ నేతలను ప్రోత్సహించి హంగామా చేయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు అంతా గమనించారు.
 రమ్య ఘటనే కాదు, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడేలా చర్యలు ఉండాలి. 

 అంతేకాకుండా ముఖ్యమంత్రిగారు మానవత్వంతో బాధితుల కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.10లక్షలు ఆర్థిక సాయాన్ని చేస్తే.. దాన్నికూడా అదేదో చేయకూడని నేరంలా,  పదిలక్షలు ఇచ్చి చేతులు దులపుకుంటున్నారా అని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. సాయం చేసే గుణం చంద్రబాబుకు, టీడీపీకి లేదు కాబట్టి వారికి మానవత్వం కూడా రాజకీయంలా కనిపిస్తుంది. 
 మానవత్వం ముఖ్యమంత్రిగారి మతం.  బంగారు తల్లులను కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేలా మానవత్వంతో సాయం చేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డిగారిపై బురద చల్లే యత్నం చేస్తున్నారు. అలాంటి శవ రాజకీయాలను ప్రతిపక్ష నేతలు మానుకుంటే మంచిది. దిశ యాప్‌ ప్రచారం కోసమే అని మాట్లాడుతున్న ప్రతిపక్షం... గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రతకు ఏం చేశారో చెప్పాలి.
  ఏ రోజూ పైసా కూడా సాయం చేయని చంద్రబాబు.. ఇవాళ మానవతా దృక్పధంతో సీఎం గారు చేస్తున్న సాయాన్ని కూడా రాజకీయంగా వ్యంగ్య ధోరణితో విమర్శలు చేయడం దారుణం, సిగ్గుచేటు.
 అదే చంద్రబాబు దళితుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, అలా మాట్లాడినందుకు ఈరోజువరకూ  పశ్చాత్తాపం ప్రకటించింది లేదు. ఆయన కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన ఆదినారాయణరెడ్డి దళితులు స్నానం  చేయరని, శుభ్రంగా ఉండరంటూ వ్యాఖ్యలు చేసినా దానిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

 అదే మా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు, ఆలోచనా విధానంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో గౌరవనీయమైన స్థానం కల్పించారు. దళిత, గిరిజన మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అన్ని పదవుల్లోనూ వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. ఈరోజు వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో అవకాశం పొందుతున్నారు. ఇలాంటి ప్రభుత్వంపై కులం పేరుతో ఆరోపణలు చేయడమా?

 నేరం చేసినవ్యక్తి ఎంతటివాళ్లు అయినా వారిని తప్పించాలని,  వదలివేయాలనేది ఈ రెండేళ్లలో ఎక్కడా జరగలేదు. అదే టీడీపీ హయాంలో ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని కొట్టిన వాళ్ల ఎమ్మెల్యేకు ఏ శిక్ష వేశారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీనినిబట్టే టీడీపీ హయాంలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఏస్థాయిలో ఉందో తెలియచేస్తుంది.

 చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే ఏడాదిలో 62మంది ఎస్సీ, ఎస్టీలు హత్యలకు గురయితే ... ఈ రెండేళ్లలో వారిపై దాడులు 51శాతం తగ్గిపోయాయి. 
 ముఖ్యమంత్రి జగన్‌ గారి పాలనలో ఎస్సీ, ఎస్టీలు ఎంతగానో గౌరవాన్ని పొందుతున్నారు. మా జాతిలోనే పుట్టాలా అని వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇవాళ దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. దళితులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న చంద్రబాబు మాట్లాడం ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పటికీ వారికి పశ్చాత్తాపం లేకుండా జరిగిన ఘటనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.

 ముఖ్యమంత్రిగారు మహిళా భద్రతపై ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఇటువంటి ఘటనలకు సంబంధించి, తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి, చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. 

 సామాజిక మాధ్యమాల్లో అపరిచితులు పరిచయం అయినప్పుడు మహిళలు, విద్యార్థినులు, ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకుగానీ, లేకుంటే దిశ యాప్‌ ద్వారానైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలి. గతంతో పోలిస్తే.. ఇప్పుడు నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దిశ చట్టం రాకముందు.. ఇప్పటికీ దాదాపు నాలుగు శాతం తగ్గుదల కనిపిస్తోంది. దిశ యాప్‌ ఉపయోగించి కేసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏపీ పోలీస్‌ సేవ ద్వారా 89 సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే అవకాశం లేనప్పుడు ఈ యాప్‌ ద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చు. మన భద్రత కోసం ప్రభుత్వం ఇస్తున్న సేవలను ఉపయోగించుకోవాలి.

 ఏదైనా నేరం జరిగితే ఏడు రోజుల్లోపు చార్జ్‌షీటు దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దిశ చట్టంను అనుసరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు రాగానే వెంటనే చార్జ్‌షీట్‌ చేయడం జరుగుతుంది. చాలామంది దిశ యాప్‌ను ఉపయోగించుకుని ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కంప్లెంట్‌ రిజిస్ట్రర్‌ చేసుకోవడం సులువు అవుతుంది. 
  టెక్నాలజీని ఎంతవరకూ వాడుకోవాలో అంతవరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.

 టెక్నాలజీ పెరిగేకొద్దే నాణేనికి అటూ, ఇటూలా మంచితోపాటు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. చాలాచోట్ల మద్యంతో పాటు, మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తోంది. నిందితుడు శశికృష్ణ విషయంలో కూడా మాదక ద్రవ్యాల వినియోగం దిశగా విచారణ జరుగుతోంది. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, స్పృహ కల్పించే విధంగా.. మరోవైపు విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలని ముఖ్యమంత్రిగారు ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి నైతిక విలువలు నేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని హోం మంత్రి సుచ‌రిత పేర్కొన్నారు. 

Back to Top