నిరూపిస్తే.. రాజీనామా చేస్తా

కాపు సంక్షేమంపై టీడీపీ నేతలకు ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా సవాల్‌

కాకినాడ: చంద్రబాబు హయాంలో కాపుల కోసం మంచి చేశారని నిరూపిస్తే.. రాజీనామా చేస్తానని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. టీడీపీ పాలనలో కాపులకు అడుగడుగునా మోసం జరిగిందన్నారు. కాకినాడలో ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో తూర్పు గోదావరి జిల్లాలో కాపు మహిళలపై అక్రమ కేసులు పెట్టి వేధించిన పరిస్థితులు చూశామన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఆ కేసులు ఎత్తివేశారన్నారు. అందుకు సీఎం వైయస్‌ జగన్‌కు దాడిశెట్టి రాజా కృతజ్ఞతలు తెలిపారు. 

చంద్రబాబు కాపులకిచ్చిన నిధులు వారి కార్యకర్తలే మింగేశారని గుర్తుచేశారు. చంద్రబాబు చేసిన మోసాన్ని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేసిన మంచిని కాపు సామాజిక వర్గం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారన్నారు. తొలి ఏడాది పాలనలోనే కాపు సామాజిక వర్గానికి రూ.4,770 కోట్లను సీఎం ఇచ్చారని, దీని ద్వారా 23 లక్షల కాపు కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు కాపులంతా రుణపడి ఉంటారన్నారు. 
 

Back to Top