జలవివాదం పరిష్కారానికే ప్రధానికి సీఎం లేఖ

సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం

పెద్దన్నగా రాయలసీమకు న్యాయం చేస్తానని కేసీఆరే అన్నారు 

నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేఆర్‌ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదని, అందుకే ప్రధానికి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. వివాదం పరిష్కారం కావాలి.. సానుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. నీటి సమస్య పరిష్కారం కాకపోవడం అంటూ ఏమీ ఉండదన్నారు. 

ఈ సందర్భంగా సజ్జల ఏం మాట్లాడారంటే..
‘850 అడుగులు దాటితే తప్ప పోతిరెడ్డిపాడుకు నీరురావడం లేదు. 881 అడుగులు ఉంటే తప్ప ఫుల్‌ఫోర్స్‌లో 40 వేల క్యూసెక్కులు తీసుకోవడం కుదరదు. తెలంగాణ రాష్ట్రం 800 అడుగుల్లోనే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుండటాన్ని అప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. 15 రోజులు ఫుల్‌ రిజర్వాయర్‌ మెయిన్‌టైన్‌ అయ్యే పరిస్థితి లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలో ఎక్కువ నీటిని క్యారీ చేసి రిజర్వాయర్‌లో స్టోర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం వైయస్‌ జగన్‌ దృషిపెట్టారు. 

ఉభయ ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు అంతకు మించి వేరే పరిష్కారం లేదని కేసీఆరే అన్నారు. రాయలసీమకు పెద్దన్నగా దగ్గరుండి అన్యాయం జరగకుండా నీరు వెళ్లేట్టు చేయిస్తానని హామీ ఇచ్చారు. మన రాష్ట్ర హక్కును మనం కాపాడుకోవాలంటే కాల్వలు వెడల్పు చేయకతప్పదు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ప్లాన్‌ చేయకతప్పలేదు. వాటి పర్మిషన్లకు దరఖాస్తు చేశారు. ఇదంతా రహస్యంగా చేస్తుంది కాదు.. ఇందులో దాపరికానికి ఏదీ లేదు. 

విద్యుత్‌ ఉత్పత్తి 834 అడుగుల తరువాత మొదలు పెట్టాల్సింది.. 800 అడుగులకు ముందే తెలంగాణ మొదలుపెట్టడం.. దీంతో వచ్చిన నీరు 2–3 టీఎంసీలు కిందికి పోతుండటం.. ఒకరకమైన విపత్కర పరిస్థితులు క్రియేట్‌ చేశారు. కొంత ఇబ్బందికర పరిస్థితి క్రియేట్‌ చేసింది తెలంగాణ రాష్ట్రమే. వర్షాలు, వరద ఎంతకాలం వస్తుందో తెలియదు.. ఇది ఇలాగే కొనసాగితే తరువాత కష్టాలపాలు కావాల్సి వస్తుందని మన ప్రభుత్వం తెలంగాణను రిక్వస్ట్‌ చేయడం, కృష్ణా వాటర్‌ బోర్డును రిక్వస్ట్‌ను చేయడం, ప్రధానికి లేఖ రాయడం జరిగింది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  

 

తాజా వీడియోలు

Back to Top