గుడ్ బై చంద్ర‌బాబు..

మంత్రి ఆర్కే రోజా

తిరుప‌తి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌చ్చు అని, ఆయ‌న‌కు గుడ్ బై చెప్పే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని మంత్రి ఆర్కే రోజా అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా.. తనను ఈసారి గెలిపించకపోతే 2024 చివరి ఎన్నికలే చివరివని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల‌పై మంత్రి రోజా స్పందించారు.  14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. 2014 ఎన్నిక‌ల్లో  ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న్ను 23 సీట్ల‌తో ప్ర‌తిప‌క్ష స్థానంలో కూర్చోబెట్టార‌న్నారు. ప్ర‌తిప‌క్షంలోనైనా త‌న పాత్ర‌ను స‌క్ర‌మంగా నెర‌వేర్చి ఉంటే ప్ర‌జ‌లు అర‌కొర‌గానైనా ఆద‌రించేవార‌న్నారు. ఈ విష‌యం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తేల‌తెల్ల‌మైంద‌న్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం మున్సిపాలిటిని కూడా అక్క‌డి ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్‌సీపీకి క‌ట్ట‌బెట్టారంటే చంద్ర‌బాబుపై ఎంత వ్య‌తిరేక‌త ఉందో అర్థం చేసుకోవ‌చ్చు అన్నారు. అలాంటి వ్య‌క్తి వ‌చ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునివ్వ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. చంద్రబాబు ఆనాడు ఏన్టీఆర్‌ను కన్నీళ్లు పెట్టించార‌ని, ఆయ‌న పార్టీని లాక్కుని ఎన్టీఆర్ మ‌ర‌ణానికి కార‌కుడ‌య్యార‌ని గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు  ఏ పార్టీ జెండా మోస్తారో తెలియని పరిస్థితి అన్నారు. మేనిఫెస్టో హామీలు నెరవేర్చని బాబు మళ్లీ అవకాశం ఇవ్వాల‌ని కోర‌డం సిగ్గు చేటని మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించారు.

Back to Top