అనంతపురం జిల్లా: హత్యా రాజకీయాలకు మారుపేరు తెలుగు దేశం పార్టీ అంటూ వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. అనంతపురం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని గానీ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గానీ విమర్శించే నైతిక అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. కుటుంబ విలువల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు తన సొంత కుటుంబ సభ్యులకు ఎంత గౌరవం ఇచ్చారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యవహరించిన తీరును ప్రజలు మరిచిపోలేదన్నారు. ఉరవకొండలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వైయస్ రాజశేఖర్రెడ్డి, జగన్పై విమర్శలు చేయడం సరికాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతూ కమిషన్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హత్యా రాజకీయాలకు మారుపేరు టీడీపీనేనని, రాజకీయంగా అడ్డొచ్చిన వారిని హతమార్చే సంస్కృతి ఆ పార్టీదేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొంగసారా, కల్తీ మద్యం, పేకాట స్థావరాలకు కొందరు టీడీపీ నేతలే కేంద్రబిందువులుగా ఉన్నారని ఆరోపించారు. “టీడీపీని బందిపోటు పార్టీ అనాలా.. ఇంకేమని పిలవాలో మీరే చెప్పండి” అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని గద్దల్లా పీక్కుతింటున్నారని, సైకిల్ గుర్తు తీసేసి గద్ద గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దోపిడీలు, అరాచకాల కారణంగా భవిష్యత్తులో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి వీరన్న, మీడియా కోఆర్డినేటర్ కె.వి. రమణ, కుడేరు మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ నారాయణరెడ్డి, స్టూడెంట్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.