ఉరవకొండ: ప్రజా సంక్షేమమే వైయస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వైయస్ఆర్ సీపీ నాయకులు విశ్వేశ్వర్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలను, ఇప్పటి వరకు ప్రతీ ఇంటికి అందిన లబ్ధిని వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.