నెల్లూరు: వెంకటాచలం మాజీ జెడ్పిటిసీ శేషయ్యపై నమోదైన తప్పుడు కేసులో పోలీసులే అసలు నేరగాళ్లు అని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఖాళీ పత్రాలపై సంతకాలు.. వెంకటాచలం మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్య యాదవ్పై శ్రావణి అనే మహిళ నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. ఆ కేసులో తన వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించు కున్నట్లు శ్రావణి వద్ద ఫిర్యాదులో రాయించారు. రిమాండ్ రిపోర్ట్ లో వివరాలు సరిగా లేవని న్యాయమూర్తి పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో మెటీరియల్ ఏవిడెన్స్ ఉందని చెబుతూ మళ్లీ ఆ రిమాండ్ రిపోర్ట్ ను మార్చి తీసుకెళ్లారు. కోవూరులో స్టాంపు వెండర్ లోక్ నాథ్ సింగ్ నుంచి స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి కొత్త స్టాంపులకు పాత తేదీలు వేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు ఏస్పీకి ఏమీ పట్టడం లేదు: పోలీసులే నేరగాళ్లగా మారి వెంకట శేషయ్యపై తప్పుడు కేసు పెట్టినట్లు సాక్ష్యాధారలు ఉన్నా కూడా నెల్లూరు ఎస్పీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అసలు నేరగాళ్ళ ను వదిలి.. ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం.. వెంకట శేషయ్య వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ గా చెప్పారు. శేషయ్యకేసుఉలో పోలీసులు న్యాయవ్యవస్థ ను తప్పుదారి పట్టించారు. ఈ కేసులో ఎంత ఉప్పు తిన్నారో... అన్ని నీళ్లు తాగిస్తా అంటూ కాకాణి హెచ్చరించారు. తప్పు చేసిన వారు సప్త సముద్రాలు అవతల ఉన్నా వదలమని, శేషయ్య కేసులో జరిగిన లోపాలు పై పూర్తి ఆధారాలతో హైకోర్టులోనూ ఫైల్ చేస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.