గుంటూరు: రాష్ట్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో సైకిల్ తొక్కండి అంటూ ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా, వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా, వ్యవసాయ రంగాలు కూడా తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన అంబటి రాంబాబు, "ఏపీలో పెట్రోల్, డీజిల్ లేదు... తొక్కండి సైకిల్ ని!" అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వనరుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఇంధన కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు ట్వీట్పై నెటిజన్లు రీట్వీట్ చేస్తూ కూటమి ప్రభుత్వ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు.