ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ

2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలు చెల్లింపు

తాడేపల్లి: ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2020-2021) నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలోకే ఫీజురీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తామని ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన పలు కీలక విషయాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ శుభవార్తను వినిపించారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించామన్నారు. అంతేకాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించామని తెలిపారు.

ఇంజనీరింగ్‌ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద గత ప్రభుత్వం రూ.35వేలు మాత్రమే ఇచ్చేదని, మిగతా డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. కానీ వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని వివరించారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, వాటిని సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌ లిస్టులో పెడతామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Back to Top